Rajinikanth: కరుణ అంత్యక్రియలకు ఎందుకు రాలేదు.. ఆయన కంటే మీరేమైనా గొప్పా?: సీఎం పళనిస్వామిపై రజనీకాంత్ నిప్పులు

  • ఎంజీఆర్, జయలలిత కంటే గొప్పవారా?
  • అందరూ వచ్చారు.. మీరెందుకు రాలేదు?
  • తాను ఆందోళన చేసి ఉండేవాడినన్న రజనీ 

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నిప్పులు చెరిగారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియల్లో ఆయన పాల్గొనకపోవడాన్ని తప్పుబట్టారు. సోమవారం నిర్వహించిన కరుణ సంస్మరణ సభలో స్టాలిన్‌తో కలిసి పాల్గొన్న రజనీకాంత్ కొవ్వొత్తులు వెలిగించి దివంగత నేతకు నివాళులర్పించారు.

అనంతరం రజనీ మాట్లాడుతూ.. కరుణ అంత్యక్రియలకు ఎందుకు రాలేదని పళనిస్వామిని ప్రశ్నించారు. గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సహా దేశం మొత్తం హాజరైందన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారన్నారు. కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి మాత్రం కనిపించలేదన్నారు.

‘‘మీరు తమిళనాడు పౌరులు కాదా? కేబినెట్‌ నుంచి ఒక్కరు కూడా హాజరు కాలేదు. ప్రజలు ఏమనుకోవాలి? మీరేమైనా ఎంజీఆరా? లేక, జయలలితా? వారి కంటే మీరు గొప్పవారా?’’ అని ప్రశ్నించారు. మెరీనా బీచ్‌లోనే కరుణ అంత్యక్రియలు నిర్వహించాలన్న మద్రాస్ హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లి వుంటే, తాను ఆందోళనకు దిగి ఉండేవాడినని రజనీకాంత్ అన్నారు. 

More Telugu News