Chandrababu: నిజనిర్ధారణ కమిటీ పర్యటన అంటే ఎందుకంత భయం?: చంద్రబాబుపై మండిపడ్డ జగన్

  • మా నిజనిర్ధారణ కమిటీ వారిని అరెస్టు చేస్తారా?
  • బాబు తప్పులు కప్పిపుచ్చుకునేందుకే 144 సెక్షన్ 
  • ఇంకెంత కాలం పోలీసులను అడ్డుపెట్టుకుంటారు?

సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. గుంటూరు జిల్లా గురజాలలో మైనింగ్ కుంభకోణాన్ని పరిశీలించడానికి తమ పార్టీ నిజనిర్ధారణ కమిటీ వెళ్తే అక్రమంగా అరెస్ట్ లు చేశారని జగన్ విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు తప్పులు కప్పిపుచ్చుకోవడానికి 144 సెక్షన్ పెట్టారని విమర్శించారు. చంద్రబాబు అక్రమాలు, కుంభకోణాలు బయటపడకుండా ఉండేందుకు ఆయనకు వ్యతిరేకంగా నినదిస్తున్న గొంతులను నొక్కడానికి, ఇంకెంత కాలం పోలీసులను ఆయన అడ్డుపెట్టుకుంటారని ఆ ట్వీట్ లో ప్రశ్నించారు.

కాగా, గురజాలలో అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించేందుకు వైసీపీ నేతలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కాసు మహేష్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ నేతలను గృహ నిర్బంధం చేయడం తగదని అన్నారు. అక్రమ మైనింగ్ పై నిజానిజాలు ప్రజలకు తెలియాలని, నిజనిర్ధారణ కమిటీ పర్యటన అంటే ప్రభుత్వానికి ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. పార్టీ సీనియర్లతో కలిసి అక్రమ క్వారీలను పరిశీలిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని అన్నారు.

More Telugu News