Tirumala: బోసిపోయిన అఖిలాండం... అలిపిరి వెలవెల... తిరుమలలో అనుకున్నదానికన్నా తగ్గిన రద్దీ!

  • భక్తులు లేక తిరుమల వెలవెల
  • హుండీ ఆదాయం రూ. 73 లక్షలే
  • వ్యాపారం లేక వాపోతున్న దుకాణదారులు

అనునిత్యమూ భక్తకోటితో కిటకిటలాడే తిరుమల శ్రీవారి ఆలయం ముందుండే అఖిలాండం బోసిపోయింది. అలిపిరి వద్ద వాహనాల అలికిడి కనిపించడం లేదు. సప్తగిరులు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. మహా సంప్రోక్షణం సందర్భంగా చాలా తక్కువ మందికే దర్శనం ఉంటుందని ముందునుంచి విస్తృతంగా చేపట్టిన ప్రచారం ఫలితాన్నిచ్చింది.

శనివారం నాడు అంకురార్పణ రోజు దాదాపు 51 వేల మందికి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నా 33,106 మంది మాత్రమే వచ్చారు. నిన్న 29,900 మంది స్వామిని చూసే వీలున్నా, 18 వేల మంది మాత్రమే వచ్చారు. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం కేవలం రూ. 73 లక్షలుగా నమోదైంది. 2006లో ఇదే మహా సంప్రోక్షణ సమయంలో భక్తులు విరివిగా వచ్చారని, అప్పటితో పోలిస్తే, ఇప్పుడు చాలా తక్కువ సంఖ్యలో భక్తులు వచ్చారని, కోట్లల్లో జరిగే వ్యాపారం లక్షల్లోకి పడిపోయిందని అధికారులు పేర్కొన్నారు.  

పెద్ద నోట్ల రద్దు తరువాత ఏర్పడినంత నష్టాన్ని ఇప్పుడు మళ్లీ చూస్తున్నామని కొండపై దుకాణదారులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. మామూలు రోజుల్లో తిరుపతి నుంచి తిరుమలకు భక్తులను చేరవేసేందుకు దాదాపు 1000 టాక్సీలు నిత్యమూ తిరుగుతుండగా, వీటిపై ఆధారపడిన డ్రైవర్లకు పని లేకుండా పోయింది.

More Telugu News