sanjay: డీఎస్ కుమారుడు ధర్మపురి సంజయ్ అరెస్ట్!

  • 3 గంటలు విచారించిన నిజామాబాద్ పోలీసులు
  • అరెస్ట్ చేసి పరీక్షల కోసం ఆస్పత్రికి తరలింపు
  • రిమాండ్ కు తరలించే అవకాశం

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు సంజయ్ ను 3 గంటల పాటు విచారించిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. దీంతో న్యాయమూర్తి సంజయ్ కు  వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో సంజయ్ ను పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం సంజయ్ ను పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కుమారుడే సంజయ్.

తాను నడుపుతున్న శాంకరి నర్సింగ్ కాలేజీలో విద్యార్థినులను ఆయన లైంగికంగా వేధించాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి సంజయ్ పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాల్సిందిగా ఆయనకు పోలీసులు నోటీసులు జారీచేశారు. దీంతో సంజయ్ ఈ రోజు నిజామాబాద్ పోలీసులకు సరెండర్ అయ్యారు. సంజయ్ తో పాటు ఆయన న్యాయవాది కృపాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. అయితే విచారణ గదిలోకి న్యాయవాదిని పోలీసులు అనుమతించలేదు. సంజయ్ పై ఈ నెల 3న నిర్భయ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

More Telugu News