Chandrababu: కొందరు చంద్రబాబు పెట్టే గడ్డి తింటున్నారు: అంబటి రాంబాబు ఆరోపణలు

  • నాడు జగన్ జైల్లో ఉంటే పార్టీ పనైపోయిందన్నారు
  • అలా జరగకపోవడంతో టీడీపీ నేతలు ఇలా కుట్రలు పన్నారు
  • మాపై ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధమే

ఈడీ కేసులో వైఎస్ భారతి పేరు నిందితురాలిగా చేర్చడంపై వార్తలొస్తున్న నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు స్పందించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొందరు చంద్రబాబు పెట్టే గడ్డి తింటున్నారని, నాడు జగన్ జైలులో ఉంటే పార్టీ పని అయిపోయింది అనుకున్నారని, కానీ, అలా జరగకపోవడంతో టీడీపీ నేతలు ఇలా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

'మా పార్టీ గుర్తుపై గెలిచి టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవి సంపాదించిన ఆదినారాయణరెడ్డి మమ్మల్ని విమర్శిస్తున్నారు. అసలు ఆయనకు సిగ్గుందా? తుని ఘటనలో రైలును వైసీపీ గూండాలు తగులబెట్టారంటున్న యనమలకు సిగ్గుందా? అధికారం మీదే కదా ఈ ఘటనపై ఎందుకు విచారణ చేయడం లేదు?' అని అంబటి ప్రశ్నించారు. తమపై ఎన్ని కుట్రలు, కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. 'ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికితే తప్పు కాదే! చంద్రబాబులా వ్యవస్థలను మేనేజ్ చేయడం మాకు రాదే' అని ఆయన విమర్శించారు.

More Telugu News