Telangana: కేసీఆర్ సర్కారు వైఖరికి నిరసనగా బాల్కొండ మండల ప్రజాప్రతినిధుల రాజీనామా

  • ఎస్సారెస్పీ రైతులకు మద్దతుగా కొన్ని రోజులుగా ఆందోళన
  • ప్రభుత్వం నీటిని విడుదల చేయకపోవడంతో రాజీనామా
  • నీళ్లు అడిగిన రైతులపైకి పోలీసులను ప్రయోగిస్తున్నారని ఆరోపణ

ఎస్సారెస్పీ (శ్రీ రామ సాగర్ ప్రాజక్ట్) రైతులపై కేసీఆర్ సర్కారు అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారు. ఎస్సారెస్పీ రైతులకు మద్దతుగా గత కొన్ని రోజులుగా  ఆందోళన చేస్తున్న బాల్కొండ జడ్పీటీసీ జోగు సంగీత, మెండోరా ఎంపీటీసీ మిట్టపల్లి రాజేశ్వర్ తాజాగా తమ పదవులకు రాజీనామా చేశారు. గురువారం స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న వీరు కలెక్టర్ రామ్మోహన్ రావుకు రాజీనామా పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటిని అడిగిన ఎస్సారెస్పీ రైతులను ప్రభుత్వం నక్సలైట్లలా చూస్తోందని ఆరోపించారు. సాగునీరు కోసం ఆందోళన చేస్తున్న రైతులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోందని ఆరోపించారు. వెంటనే రైతులకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

More Telugu News