Bse: భారత చరిత్రలో తొలిసారిగా 38 వేల మార్క్ ను తాకిన సెన్సెక్స్... ఇన్వెస్టర్ల సంబరాలు!

  • రూ. 1,55,55,255 కోట్లకు మార్కెట్ కాప్
  • ఉదయం 10.02 గంటలకు 38 వేల మార్క్
  • మిఠాయిలు పంచుకున్న బీఎస్ఈ ఇన్వెస్టర్లు

భారత స్టాక్ మార్కెట్ రికార్డుల మీద రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డులపై ఉన్న బీఎస్ఈ సెన్సెక్స్ సూచి, ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన తరువాత తొలిసారిగా 38 వేల మార్క్ ను తాకింది. ఈ సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ఇన్వెస్టర్లు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.

ఉదయం 10.02 గంటల సమయంలో సెన్సెక్స్ 38 వేల మార్క్ ను తాకింది. ఆపై 10.39 నిమిషాలకు 38,052 పాయింట్ల స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ప్రస్తుతం సెన్సెక్స్ 37,950 పాయింట్ల వద్ద సాగుతోంది. ఇది కూడా క్రితం ముగింపుతో పోలిస్తే 63 పాయింట్లు అధికం.

ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 11,455 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, లుపిన్, హిందాల్కో తదితర కంపెనీలు లాభాల్లో నడుస్తుండగా, భారతీ ఎయిర్ టెల్, ఓఎన్జీసీ, టైటాన్, జడ్ఈఈఎల్, మారుతి సుజుకి తదితర కంపెనీలు స్వల్ప నష్టాల్లో ఉన్నాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ రూ. 1,55,55,255 కోట్లకు చేరుకుంది.

More Telugu News