Jaipur: భర్త వేధింపులు భరించలేక ఐఆర్ఎస్ అధికారి ఆత్మహత్య

  • ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న అధికారిణి
  • భర్త, అత్త కారణమంటూ సూసైడ్ నోట్
  • కేసు పెట్టని బాధిత కుటుంబ సభ్యులు

తల్లితో కలిసి భర్త పెట్టే బాధలు భరించలేక ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారిణి ఆత్మహత్య చేసుకున్నారు. జైపూర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. బిన్నీ శర్మ (34), ఇండియన్ అకౌంట్స్ అండ్ ఆడిట్ ఆఫీసర్ అయిన గుర్‌ప్రీత్ వాలియా మధ్య శిక్షణ సమయంలో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడేళ్ల క్రితం గుర్‌ప్రీత్‌కు జైపూర్ బదిలీ అయింది. అయితే, వైవాహిక బంధంలో సమస్యల కారణంగా గతేడాది గుర్‌ప్రీత్ ట్రాన్స్‌ఫర్ చేయించుకుని చండీగఢ్ వెళ్లిపోయారు.

ఈ క్రమంలో బిన్నీ శర్మ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తన మరణానికి భర్త, ఆమె తల్లే కారణమని పేర్కొంటూ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మరణవార్త విని భర్త వస్తాడని భావించినా రాకపోవడం, సెల్ స్విచ్ఛాప్ చేసి ఉండడంతో పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బిన్నీశర్మ కుటుంబ సభ్యులు నిరాకరించారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆ విషయాన్ని ఆలోచిస్తామని చెప్పడంతో పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News