Maruthi Suzuki: థర్డ్ జనరేషన్ మారుతి సుజుకి 'స్విఫ్ట్' వచ్చేసింది... ప్రత్యేకతలు, ధర వివరాలు!

  • ఇండియాలో అత్యధికంగా కార్లను విక్రయిస్తున్న మారుతి సుజుకి
  • 7.76 లక్షల ధరలో ఏజీఎస్ ఫీచర్ తో స్విఫ్ట్ 
  • 2005 నుంచి ఇప్పటివరకూ అమ్ముడైన 19 లక్షల స్విఫ్ట్ యూనిట్లు

ఇండియాలో అత్యధికంగా వాహనాలను విక్రయిస్తున్న మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ ను విడుదల చేసింది. ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్ స్విఫ్ట్‌ లో ఏజీఎస్‌ (ఆటో గేర్ షిఫ్ట్) ఫీచర్‌ ను జోడిస్తూ తీసుకు వచ్చింది. దీని ధర  రూ. 7.76 లక్షలు (పెట్రోల్‌ వేరియంట్‌), రూ. 8.76 లక్షలు (డీజిల్‌ వేరియంట్‌) ఉన్నట్లు (ఎక్స్ షోరూం - న్యూఢిల్లీ) సంస్థ తెలిపింది. కాగా, గడచిన ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌ పోలో ఈ మోడల్ ను మారుతి సుజుకి తొలిసారిగా చూపించిన సంగతి తెలిసిందే.

వీఎక్స్‌ఐ, జడ్‌ఎక్స్‌ఐ, వీడీఐ, జడ్‌ డీఐ వేరియంట్లలో ఆటో గేర్ షిఫ్ట్ ఫీచర్‌ ను అందుబాటులోకి తెస్తామని సంస్థ అప్పట్లోనే వెల్లడించింది. ప్రస్తుతం టాప్ ఎండ్ మోడల్స్ అయిన జడ్‌ఎక్స్‌ఐ ప్లస్‌ ట్రిమ్‌, జడ్‌ డీఐ ప్లస్‌ లలో ఈ సదుపాయం తీసుకు వచ్చామని సంస్థ మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ విభాగం సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ కల్సీ వెల్లడించారు. ఏజీఎస్ రాకతో స్విఫ్ట్ బ్రాండ్ విలువ మరింతగా పెరుగుతుందని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా, 2005లో తొలి స్విఫ్ట్ మోడల్ మార్కెట్లోకి రాగా, ఈ 13 సంవత్సరాల వ్యవధిలో 19 లక్షలకు పైగా కార్ యూనిట్లు అమ్ముడయ్యాయి.

More Telugu News