Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ కు చుక్కెదురు!

  • నేషనల్ హెరాల్డ్ కేసును బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తెరపైకి తెచ్చారు
  • మీడియా రిపోర్టింగ్ ను నిలువరించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన కోర్టు  
  • నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు

నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురయ్యింది. ఈ కేసుకు సంబంధించి మీడియా కవరేజీని నిలువరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరిన రాహుల్‌ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి అసోసియేట్ జర్నల్ కు ఏఐసీసీ యంగ్ ఇండియా ద్వారా 99 కోట్ల రూపాయలు ఇచ్చిందని, యంగ్ ఇండియా లో రాహుల్ గాంధీ డైరెక్టర్ పదవిలో వున్నారని, ఆ వివరాలను ఆదాయపన్ను శాఖకు ఉద్దేశపూర్వకంగానే ఇవ్వలేదని ఆదాయపు పన్ను శాఖ హైకోర్ట్ కు నివేదించింది.

 అయితే యంగ్ ఇండియా లో డైరెక్టర్ పదవి ద్వారా తనకు ఎలాంటి ఆదాయం లేదని, ఆ కారణంగానే ఆదాయపు పన్ను చెల్లించాల్సిన, వివరాలు ఇవాల్సిన అవసరం లేదని రాహుల్ గాంధీ తరపు న్యాయవాది ధర్మాసనానికి వినిపించారు. కాగా, నేషనల్‌ హెరాల్డ్‌ కేసును బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి తెరపైకి తెచ్చారు. సోనియా, రాహుల్‌ గాంధీల తాలూకు  కంపెనీలకు వ్యతిరేకంగా సుబ్రహ్మణ్యస్వామి న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. కాంగ్రెస్‌ పార్టీ నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికను నిర్వహించే అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌కు రూ 90.25 కోట్ల వడ్డీలేని రుణాన్ని మంజూరు చేసిందని తన పిటిషన్‌లో ఆరోపించారు.

దీంతో నేషనల్‌ హెరాల్డ్‌, యంగ్‌ ఇండియా లావాదేవీలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ తిరిగి అసెస్‌మెంట్‌ పరిశీలించాలని ఆదేశించిన నేపధ్యంలో ఆదాయపుపన్ను శాఖ ఉత్తర్వులను రాహుల్‌ గాంధీ హైకోర్టులో సవాల్‌ చేశారు. కేసు విచారణ జరుగుతున్న తరుణంలో మీడియా రిపోర్టింగ్ ని నిలువరించాలని రాహుల్ గాంధీ కోర్టును కోరారు. అయితే ఢిల్లీ హై కోర్టు ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది.


More Telugu News