wilson: గురి తప్పని ‘కరుణ’ బాణం.. లాయర్ విల్సన్!

  • కేసుల్లో విజయాలు సాధించడంలో దిట్ట
  • సమాచీర్ కల్వీ, ఏకీకృత ఫీజు కేసుల్లో అనుకూల తీర్పులు
  • కరుణ చేత విన్-సన్ అనిపించుకున్న ఉద్ధండుడు

డీఎంకే అధినేత, దివంగత కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్ లో నిర్వహించుకోవచ్చని మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో డీఎంకేకు అనుకూలంగా తీర్పు రాబట్టడంలో ఆ పార్టీ సీనియర్ అడ్వొకేట్ గా ఉన్న పి.విల్సన్ కీలకంగా వ్యవహరించారు.

విల్సన్ అంటే కరుణకు చాలా గురి. గతంలో తమిళనాడు అదనపు అడ్వొకేట్ జనరల్ గా పనిచేసిన విల్సన్.. కరుణ మానసపుత్రిక ‘సమాచీర్ కల్వీ’పై మద్రాస్ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేసుల్ని వాదించి గెలిచారు. రాష్ట్రమంతా ఏకీకృత విద్యా విధానం కోసం ఆ వ్యవస్థను కరుణ తీసుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఏకీకృత ఫీజు విధానాన్ని ప్రభుత్వం అమలు చేయడంపై విల్సన్ కోర్టులో గట్టిగా వాదించారు.

దీంతో ఓ సందర్భంలో కరుణ విల్సన్ తో.. ‘నువ్వు విల్సన్ వి కాదు.. విన్-సన్ వి’ అని కితాబిచ్చారట. తాజాగా మెరీనా బీచ్ కేసును వాదించిన విల్సన్ ఆయన నమ్మకాన్ని ఇప్పుడూ నిలబెట్టుకున్నారు. మంగళవారం రాత్రి 6.10 గంటలకు కరుణ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

More Telugu News