Haryana: హరియాణాలో రోడ్డు రిపేర్ పనులకు విద్యార్థులు.. కాదంటే కొడుతున్న టీచర్లు!

  • మహేంద్ర గఢ్ లో ఘటన
  • టీచర్లు కొడుతున్నారన్న విద్యార్థులు
  • విచారణకు ఆదేశించిన అధికారులు

సాధారణంగా స్కూలుకు వెళ్లే పిల్లలు అవసరమైతే పాఠశాల ఆవరణను శుభ్రం చేస్తుంటారు. మొక్కలు కూడా నాటుతుంటారు. టీచర్లు, విద్యార్థులు కలసి సరదా వాతావరణంలో ఇలాంటి పనులు చేస్తుంటారు. కానీ హరియాణాలో మాత్రం సీన్ రివర్స్ అయింది.

ఇక్కడి మహేంద్రగఢ్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద రోడ్డు బాగా దెబ్బతింది. దీంతో స్కూల్ కొచ్చిన విద్యార్థులకు టీచర్లు చదువు చెప్పకుండా రోడ్డు రిపేర్ చేయాలని ఆదేశించారు. దీంతో పిల్లలు యూనిఫాంలోనే మట్టి, కంకర తీసుకొచ్చి రోడ్డు గుంతలను పూడ్చుతున్నారు.

ఈ విషయమై విద్యార్థుల్ని మీడియా ప్రశ్నించగా.. రోడ్డు రిపేరు చేయకుంటే టీచర్లు తమను చావబాదుతున్నారని పిల్లలు వాపోయారు. దీంతో ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారి రాజ్ బాలా దృష్టికి కొందరు తీసుకెళ్లారు. కాగా, ఈ ఘటనపై విచారణకు ఆదేశించామనీ, దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్ బాలా తెలిపారు.

More Telugu News