Tamilnadu: కరుణానిధి మరణవార్త తెలిసి తట్టుకోలేక ఆగిన గుండె.. ఇద్దరు అభిమానుల మృతి!

  • రాష్ట్రం మొత్తం కన్నీటి సంద్రం
  • గుండెలవిసేలా రోదిస్తున్న అభిమానులు
  • సంయమనం పాటించాలన్న నేతలు

కరుణానిధి మరణ వార్త తెలిసి ఇద్దరు కార్యకర్తల గుండె  ఆగిపోయింది. అభిమాన నేత మరణాన్ని జీర్ణించుకోలేని వారి గుండెలు హఠాత్తుగా ఆగిపోయాయి. మైలాడుతురైకి చెందిన సుబ్రహ్మణ్యం, నాగపట్టణానికి చెందిన రాజేంద్రన్ పార్టీ కార్యకర్తలు. కరుణానిధికి వీరాభిమానులు. 50 ఏళ్ల పైబడిన ఈ ఇద్దరూ కరుణానిధి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచీ ముభావంగా ఉంటున్నారు.

మంగళవారం సాయంత్రం కరుణ మరణవార్త తెలిసిన వెంటనే కన్నీటి పర్యంతమయ్యారు. గుండెలు పగిలేలా ఏడ్చి అలాగే కుప్పకూలిపోయారు. గుండెపోటుతో వీరు మరణించడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదం నిండింది. విషయం తెలిసిన డీఎంకే నేతలు సంయమనం పాటించాలని పార్టీ శ్రేణులను కోరుతున్నారు.

కరుణానిధి మరణవార్త తెలిసినప్పటి నుంచి రాష్ట్రం మొత్తం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. అభిమాన నేతను కడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తుతున్నారు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.  

More Telugu News