Parents: తాంత్రికుడి మాటలతో కన్న కూతురిని చిదిమేసిన తల్లిదండ్రులు!

  • తాంత్రికుడు చెప్పాడని తల్లిదండ్రుల ఘాతుకం
  • అనారోగ్యం తో బాధ పడుతున్న బిడ్డ పాశవిక హత్య
  • మళ్ళీ పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందనే మూఢనమ్మకం

మూఢ నమ్మకం ఒక చిన్నారి జీవితాన్ని చిదిమేసింది. ఒక తాంత్రికుడి మాటలు నమ్మి కన్న కూతురినే కడతేర్చారు ఆ తల్లిదండ్రులు. కడుపున పుట్టిన బిడ్డ అనారోగ్యంగా వుండటంతో ఆ బిడ్డను చంపితే మళ్లీ పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని భావించి అత్యంత కర్కశంగా బిడ్డ ప్రాణం తీశారు. అనుమానం రాకుండా ఇంట్లోనే పూడ్చి పెట్టారు. రక్త సంబంధానికి అర్ధం లేకుండా చేసిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లోని చౌదర్‌పూర్‌ అనే గ్రామంలో జరిగింది.

  తాంత్రికుడు చెప్పాడని మూఢ నమ్మకంతో తల్లిదండ్రులు ఆరేళ్ల కూతురు తారని చంపి పూడ్చి పెట్టారు.  వారికి పుట్టిన పిల్లలు ఇద్దరూ అనారోగ్యంతో వుండటం వల్లే తాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి పాపకు ఊపిరాడకుండా చేసి చంపేశారు. పాప కనిపించకపోవటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

ఈ క్రమంలో ఇంట్లో పాతిపెట్టిన తార మృతదేహం బయటపడింది. పోస్ట్ మార్టం నిర్వహించిన పోలీసులు తల్లిదండ్రులే హంతకులుగా కేసు నమోదు చేశారు. అయితే ఎన్ని మందులు వాడినా పాపకు వ్యాధి నయం కాకపోవటం, అలాగే తమ బాబుకి సైతం ఎముకలు వంకర్లు పోయే వ్యాధి వుండటం వల్లే ఇలా చేశామని తార బామ్మ చెప్పింది.  

More Telugu News