Yadadri Bhuvanagiri District: వ్యభిచార నిర్వాహకులనే 'అమ్మ'లనుకుంటున్న యాదాద్రి చిన్నారులు... అధికారుల కంటతడి!

  • అమ్మ, అక్క ఎప్పుడు వస్తారని అడుగుతున్న చిన్నారులు
  • వ్యభిచార గృహాల నిర్వాహకులే సొంతవారన్న భావనలో పిల్లలు
  • వాస్తవ పరిస్థితులు తెలియజెప్పేందుకు అధికారుల ప్రయత్నాలు

"మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకు వచ్చారు. మా అమ్మ ఎక్కడుంది? అక్క ఎప్పుడు వస్తుంది?..." ఇవి యాదగిరిగుట్టులోని వ్యభిచార గృహాల నుంచి సంరక్షించి తెచ్చిన చిన్న పిల్లలు సంక్షేమ గృహంలో అధికారులను అడుగుతున్న ప్రశ్నలు. తమను నిత్యమూ హింసిస్తూ, దారుణంగా ప్రవర్తిస్తున్నప్పటికీ, వ్యభిచార గృహాల నిర్వాహకులే తమవారని వీరు భావిస్తున్నారు. మొత్తం 15 మంది పిల్లలను అధికారులు రక్షించగా, వీరిలో అత్యధికులు తమ సొంత వారిని మరచిపోయినట్టు తెలుస్తోంది. వ్యభిచార కేంద్రాల నిర్వాహకులు, వారిపై బంధాల విషపు వల విసిరారని, అందుకు వారడుగుతున్న ప్రశ్నలే ఉదాహరణని అధికారులు అంటున్నారు.

పిల్లలను ఆలించి, లాలిస్తున్న మహిళా అధికారిణులు, వారి మాటలను విని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆరేళ్లు పైబడిన వారు, వ్యభిచార గృహాల్లో అనుభవించిన బాధను, చూసిన దృశ్యాలను తలచుకుని, స్వేచ్ఛలోకి వచ్చామన్న భావంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అంతకన్నా తక్కువ వయసున్న వారు మాత్రం ప్రతి క్షణం ఏడుస్తున్నారు. వారిని వాస్తవ పరిస్థితుల్లోకి తెచ్చేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇక వీరిలో కొందరిని వారి తల్లిదండ్రులు గుర్తించారని, డీఎన్ఏ పరీక్షల తరువాత వారిని అప్పగిస్తామని వెల్లడించారు.

More Telugu News