Android P: ఆండ్రాయిడ్ ‘పీ’ని విడుదల చేసిన గూగుల్.. యూజర్లకు ఇక స్మార్ట్ ఎక్స్‌పీరియన్స్!

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వచ్చేసిన ‘పీ’
  • ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ ఫోన్లకు మాత్రమే
  • వచ్చే ఏడాది నుంచి అన్ని ఫోన్లకు అందుబాటులోకి

ఆండ్రాయిడ్ అప్లికేషన్లు విడుదల చేస్తూ ఒక్కోదానికి ఒక్కో పేరు పెడుతున్న గూగుల్ తాజాగా లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీనికి పీ (pie) అని నామకరణం చేసింది. ఆండ్రాయిడ్ ‘ఓ’కు సక్సెసర్‌గా తీసుకొచ్చిన ఈ వెర్షన్‌లో బోలెడన్ని ఫీచర్లు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత అడాప్టివ్ బ్యాటరీ సిస్టం, నేవిగేటింగ్ సిస్టం తదితర ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం పిక్సెల్ ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ వెర్షన్.. ఈ ఏడాది తర్వాత అందరికీ అందుబాటులోకి రానుంది.

స్మార్ట్‌ఫోన్ యూజర్ల పనిని ఈ ఆపరేటింగ్ సిస్టం మరింత సులభతరం చేస్తుందని గూగుల్ తెలిపింది. యూజర్ తర్వాత ఏం చేయబోతున్నాడన్నది ముందే పసిగట్టి ఇందులోని ఏఐ సాంకేతికత అందుకు అనుగుణంగా సిద్ధమవుతుందని, తద్వారా యూజర్ పని మరింత సులభం అవుతుందని వివరించింది. ఆండ్రాయిడ్ 9 యూజర్ల జీవితాలతో పెనవేసుకుపోతుందని పేర్కొంది.

ఇందులోని అడాప్టివ్ బ్యాటరీ యూజర్ ఎటువంటి యాప్స్‌ను వినియోగిస్తున్నాడో తెలుసుకుంటుందని, అందుకు తగ్గట్టుగా బ్యాటరీని వినియోగించుకుంటుందని తెలిపింది. అలాగే, అడాప్టివ్ బ్రైట్‌నెస్ ఫీచర్.. యూజర్‌కు ఎంత వెలుగు కావాలో అంతే ఇస్తుందని గూగుల్ వివరించింది. ఇంకా, సింగిల్ క్లిక్‌తో నేవిగేషన్, స్మార్ట్ టెక్ట్స్ సెలక్షన్, డ్యాష్ బోర్డ్, డునాట్ డిస్టర్బ్, విండ్ డౌన్ తదితర ఫీచర్లు ఉన్నట్టు తెలిపింది.

More Telugu News