Gutta jwala: కేసీఆర్ ప్రభుత్వంపై గుత్తా జ్వాల సంచలన ట్వీట్.. ఆ పై తొలగింపు!

  • అకాడమీ ఏర్పాటుకు, ఇంటికి స్థలమిస్తామన్నారు
  • నాలుగేళ్లు అయినా ఆ ఊసు లేదు
  • ఆవేదన వ్యక్తం చేసిన బ్యాడ్మింటన్ స్టార్

తెలంగాణ ప్రభుత్వంపై బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాల సంచలన ట్వీట్ చేసింది. ప్రభుత్వం తనకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని అందులో  ఆరోపించింది. ఆమె ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అయింది. అన్ని చానళ్లలోనూ ప్రముఖంగా రావడంతో ఆ తర్వాత కాసేపటికే జ్వాల ఆ ట్వీట్‌ను తొలగించింది.

బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు, ఇంటి స్థలం కోసం ప్రభుత్వం  స్థలం ఇస్తామని నాలుగేళ్ల క్రితం హామీ ఇచ్చిందని, అయినా, ఇప్పటి వరకు ఈ విషయంలో ఎటువంటి పురోగతి లేదని జ్వాల ఆవేదన వ్యక్తం చేసింది. ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని ఈ డబుల్స్ స్టార్ విమర్శించింది.

తెలంగాణ అథ్లెట్లకు ప్రోత్సాహకంగా అప్పట్లో ప్లాట్‌లు ప్రకటించిందని, అందులో భాగంగానే తనకూ నజరానాలు ప్రకటించిందని పేర్కొన్న జ్వాల ఇప్పటి వరకు అది అందకపోవడం బాధగా ఉందని పేర్కొంది. మంత్రి కేటీఆర్‌కు, సీఎం కార్యాలయానికి ఈ ట్వీట్‌ను ట్యాగ్ చేసింది. అయితే, ఆ తర్వాత కాసేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది.  

More Telugu News