Tamilnadu: తన కుమార్తెను కలవద్దని చెప్పినందుకు... మేనత్తను టెడ్డీ బేర్ తో హత్య చేసిన టెన్త్ విద్యార్థి!

  • తమిళనాడు రాజధాని చెన్నైలో ఘటన
  • ముఖానికి టెడ్డీ బేర్ ను అదిమి హత్య చేసిన టెన్త్ విద్యార్థి
  • ఆపై మణికట్టుపై కత్తితో గాయం

తన కుమార్తెను కలవద్దని, ఆమెతో మాట్లాడవద్దని చెప్పిన సొంత మేనత్తను హత్య చేశాడో మేనల్లుడు. చెన్నైలోని వల్లలార్ స్ట్రీట్ లో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, శంకర్ సుబ్బు (45) అనే వ్యక్తి కిరాణ దుకాణం నడుపుతుండగా, అతనికి తమిళ్ సెల్వి (40) అనే భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మధ్యాహ్న భోజన సమయానికి ఇంటికి వచ్చిన శంకర్ కు భార్య స్పృహ తప్పిన స్థితిలో, చేతికి గాయంతో పడివుండటంతో ఆసుపత్రికి తరలించేసరికి ఆమె మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ కేసులో పోలీసులు విచారణ ప్రారంభించగా, పోస్టుమార్టం రిపోర్టులో ఆమె గొంతును ఎవరో అదిమిపెట్టి ఊపిరాడకుండా చేశారని, ఆ పైనే మణికట్టుకు గాయం అయిందని తెలిసింది. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, శంకర్ సోదరి కుమారుడైన టెన్త్ చదువుతున్న విద్యార్థి ఆ ఇంటికి వచ్చినట్టు గుర్తించారు.

 అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తే, అత్తను తానే హత్య చేశానని, టెడ్డీ బేర్ ను అమె ముఖానికి గట్టిగా అదిమిపెట్టానని నేరాన్ని ఒప్పుకున్నాడు. మామ కుమార్తె అంటే తనకు ఇష్టమని, కానీ తాము కలుస్తుండటం అత్తకు నచ్చకపోవడం వల్లే ఈ హత్య చేశానని చెప్పాడు. అనుమానం రాకుండా ఉండేందుకు మణికట్టుపై కోశానని చెప్పాడు. నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ కారాగారానికి తరలించామని పోలీసులు తెలిపారు.

More Telugu News