Undavalli Arunkumar: జగన్ సీఎం అయితే డైరెక్టుగా వెళతా... చంద్రబాబే వస్తే సీక్రెట్ గా పని చేయించుకోవాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

  • వైసీపీ గెలిస్తే తెలిసిన వారే మంత్రులవుతారు
  • ఇటీవలి చంద్రబాబుతో కలయిక మర్యాద పూర్వకమే
  • ఆయన పిలిస్తేనే వెళ్లానన్న ఉండవల్లి

వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే, తనకు తెలిసిన వారే మంత్రులుగా ఉంటారని, ఏదైనా పని చేయించుకోవాల్సి వస్తే, వారి వద్దకు డైరెక్టుగా వెళ్లే అవకాశం లభిస్తుందని, అదే ఇంకోసారి చంద్రబాబు వస్తే, రహస్యంగా మంత్రులతో మాట్లాడి పని చేయించుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ చమత్కరించారు. తాను ఎల్లప్పుడూ చంద్రబాబును విమర్శించిన వాడిగా ఉండటమే ఇందుకు కారణం కావచ్చని చెప్పారు. ఒకవేళ జగన్ సీఎం అయితే, ఆయనకూ తాను క్రిటిక్ గా మారే అవకాశాలు రావచ్చని చెప్పారు.

అయితే, గత నాలుగేళ్లలో చంద్రబాబుతో పనులు చేయించుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పిన ఉండవల్లి, ఇటీవల తాను చంద్రబాబును మర్యాద పూర్వకంగానే కలిశానని అన్నారు. ఆయన పిలిస్తేనే తాను వెళ్లానని, చంద్రబాబు అపాయింట్ మెంట్ ను తాను కోరలేదని చెప్పారు. పవన్ కల్యాణ్ ను కూడా ఆయన పిలిస్తేనే వెళ్లి కలిసొచ్చానే తప్ప తనంతట తానుగా వెళ్లలేదని తెలియజేశారు. పవన్ కల్యాణ్ పిలవడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.

More Telugu News