tv9: చంద్రబాబులో ఉన్నది, జగన్ లో లేనిదీ అదే!: ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషణ

  • ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో చంద్రబాబు సిద్ధహస్తుడు
  • జగన్ వద్ద ఆ తెలివితేటలు తక్కువ
  • ప్రస్తుతానికి అడ్వాంటేజ్ మాత్రం జగన్ కే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది కూడా సమయం లేని ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు చంద్రబాబునాయుడితో పోలిస్తే అడ్వాంటేజ్ అధికంగా ఉందని రాజకీయ విశ్లేషకుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం ఉందని గుర్తు చేస్తూ, ఆ సమయానికి ఏదైనా జరగవచ్చని చెప్పారు.

చంద్రబాబు, జగన్ ల మధ్య తేడా గురించి ప్రస్తావిస్తూ, ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో చంద్రబాబు సిద్ధహస్తుడని, స్వయంగా వ్యూహాలను రచించగల దిట్టని చెప్పారు. జగన్ వద్ద ఎలక్షన్ మేనేజ్ మెంట్ శక్తి లేదని, ఆయన వద్ద ఆ పనిని సమర్థవంతంగా చేసిపెట్టగల వారు ఎవరైనా ఉన్నారా? అన్న విషయం తనకు తెలియదని చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు సైతం జగన్ కు అడ్వాంటేజ్ ఉందని అందరూ భావించారని, అయితే, చివరి నెలన్నర రోజులూ చంద్రబాబు పన్నిన వ్యూహాలు ఫలితాలను మార్చి ఆయనకు అనుకూల ఫలాన్నిచ్చాయని చెప్పారు.

"చంద్రబాబును ఎదుర్కునే సత్తా జగన్ కు లేదు" అని తాను అన్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పారు. తనకు సంబంధించినంత వరకూ తమ నేత రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డిగా అభిమానం ఉందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ నేతల్లో తక్కువ మంది టీడీపీలో, ఎక్కువమంది వైసీపీలో ఉన్నారని, జగన్ గెలిస్తే తాను కూడా ఆనందిస్తానని చెప్పారు.

More Telugu News