kerala: ఢిల్లీలోని కేరళ భవన్ ముందు కత్తితో వ్యక్తి హల్ చల్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు!

  • కేరళకు చెందిన విమల్ గా గుర్తింపు
  • మతిస్థిమితం లేదని తేల్చిన పోలీసులు
  • విజయన్ కు శశిథరూర్ ఫోన్

దేశ రాజధాని ఢిల్లీలోని కేరళ భవన్ వద్ద ఓ వ్యక్తి ఈ రోజు కత్తితో హల్ చల్ చేశాడు. తనను సీఎం పినరయి విజయన్ ను కలుసుకునేందుకు అనుమతించాలని డిమాండ్ చేశాడు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని పదేపదే హెచ్చరించాడు.

కేరళకు చెందిన విమల్ రాజ్ ఈ రోజు ఢిల్లీలోని కేరళ భవన్ వద్దకు చేరుకున్నాడు. చొక్కాపై జాతీయ జెండాతో ఓ చేతిలో కాగితాలు, మరో చేతిలో కత్తి పట్టుకుని హల్ చల్ చేశాడు. సీఎం పినరయి విజయన్ ను తాను కలవాలని అనుకుంటున్నట్లు పలుమార్లు చెప్పాడు.‘నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను చేస్తున్న వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. రోజుకు కనీసం రూ.500 నుంచి 600 కూడా గిట్టడం లేదు. నా బాధలన్నీ ఈ కాగితంలో రాశాను. నాకు బతకాలని లేదు. ఈ ముఖ్యమంత్రి(విజయన్) నుంచి నాకు ఎలాంటి సాయం అక్కర్లేదు’ అని అరిచాడు.

ఈ ఘటన జరిగినప్పుడు విజయన్ కేరళ భవన్ లోనే ఉన్నారు. దీంతో విమల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమల్ వద్ద ఉన్న కాగితాలను పరిశీలించిన పోలీసులు ఆయన మానసిక స్థితి సరిగ్గా లేనట్లు గుర్తించారు. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శశి థరూర్ విజయన్ తో మాట్లాడారు.

More Telugu News