Warangal Rural District: వరంగల్ జిల్లాలోని హైస్కూల్ లో విచిత్ర పరిస్థితి... టీచర్లు 9 మంది, విద్యార్థులు ఒక్కరూ లేరు!

  • గత సంవత్సరం తరగతికి ఒక్కరు చొప్పున విద్యార్థులు
  • ఈ సంవత్సరం వారు కూడా వెళ్లిపోయారు
  • ఆంగ్ల మీడియంపై మక్కువతోనే అంటున్న అధికారులు

అది వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం ముచ్చింపుల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్. 10 తరగతి గదులు ఉన్నాయి. 9 మంది ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేందుకు రెడీగా ఉన్నారు. కానీ ఏం లాభం? ఆ పాఠశాలలో కనీసం ఒక్కరంటే ఒక్కరైనా విద్యార్థి లేడు. 2002కు ముందు ప్రాథమికోన్నత పాఠశాలగా ఉన్న స్కూల్ ను ఆపై అప్ గ్రేడ్ చేశారు.

గత సంవత్సరం 6 నుంచి 10వ తరగతి వరకూ ఒక్కో తరగతిలో ఒక్కో విద్యార్థి మాత్రమే ఉండగా, ఈ సంవత్సరం స్కూళ్లు తెరవగానే నలుగురు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. టెన్త్ క్లాసులో మిగిలిన ఒకే ఒక్క బాలిక, గత నెలలో వెళ్లిపోయింది. దీంతో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, మరో 8 మంది రోజూ స్కూలుకు వచ్చి సాయంత్రం వరకూ ఖాళీగా ఉండి వెళ్లిపోతున్నారు.

ఈ గ్రామంలో హైస్కూలు విద్య చదివే విద్యార్థుల సంఖ్య 18 మంది కాగా, వారంతా ప్రైవేటు స్కూళ్లకే వెళుతున్నట్టు తెలుస్తోంది. ఈ స్కూల్ తెలుగు మీడియంలో ఉండటంతోనే ఎవరూ చేరడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ స్కూల్ ను మూసేసి, ఉపాధ్యాయులను మరెక్కడికైనా బదిలీ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News