Hyderabad: హైదరాబాద్ లో విద్యార్థినులతో టీచర్ వెకిలిచేష్టలు.. స్కూలుకొచ్చి కుమ్మేసిన తల్లిదండ్రులు!

  • డీడీ నగర్ చైతన్య స్కూల్ లో ఘటన
  • చావబాది పోలీసులకు అప్పగించిన తల్లిదండ్రులు
  • స్కూల్ లో ఫర్నీచర్ ధ్వంసం

విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఆ టీచర్ కీచకుడిగా మారాడు. విద్యార్థినులకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ అలాగే చేయాలని వేధించడం మొదలుపెట్టాడు. దీంతో స్కూలుకు చేరుకున్న బాలికల తల్లిదండ్రులు సదరు కీచక టీచర్ ను చితకబాది పోలీసులకు అప్పగించారు.

హైదరాబాద్ లోని డీడీ నగర్ కాలనీలో ఉన్న చైతన్య స్కూల్ లో పనిచేస్తున్న రమేశ్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థినుల్ని వేధించేవాడు. లంచ్ బ్రేక్ సమయంలో పోర్న్ చిత్రాలు చూపిస్తూ అలాగే చేయాలని చెప్పేవాడు. గతంలో కూడా ఇలాంటి వెకిలి చేష్టలు చేయడంతో రమేశ్ ను మందలించి వదిలేశారని తెలుస్తోంది. తాజాగా ఈ వేధింపులను తాళలేని బాలికలు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ప్రిన్సిపల్ తో మాట్లాడేందుకు అమ్మాయిల తల్లిదండ్రులు ఈ రోజు ఉదయం పాఠశాల వద్దకు చేరుకున్నారు.

వీరిని చూసిన రమేశ్ అక్కడ్నుంచి పరారయ్యేందుకు యత్నించాడు. దీంతో ఆగ్రహించిన విద్యార్థినుల తల్లిదండ్రులు రమేశ్ ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా స్కూల్ ఫర్నీచర్ ను కూడా వారు ధ్వంసం చేశారు.

More Telugu News