jaffruddin: హరియాణాలో దారుణం.. ముస్లిం యువకుడ్ని కొట్టి గడ్డం తీయించారు!

  • మతం పేరుతో దూషించిన నిందితులు
  • దాడి చేసి, గడ్డం తీయించిన వైనం
  • ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ముస్లిం యువకుడ్ని మతం పేరుతో తీవ్రంగా దూషించిన దుండగులు.. అతను ఎదురుతిరగడంతో దాడి చేయడంతో పాటు బలవంతంగా సెలూన్ కు లాక్కెళ్లి గడ్డాన్ని తీయించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హరియాణాలోని మేవాట్ లో ఉంటున్న జఫ్రుద్దీన్ తన స్నేహితుడిని కలుసుకునేందుకు మంగళవారం గురుగ్రామ్ కు వచ్చాడు. ఈ సందర్భంగా ఖాన్సా మండీ ప్రాంతంలో కొందరు దుండగులు జఫ్రుద్దీన్ ను మతం పేరుతో దూషించడం మొదలుపెట్టారు. అయినా జఫ్రుద్దీన్ పట్టించుకోలేదు. చివరికి వేధింపులు మరింత ఎక్కువ కావడంతో దుండగులకు, జఫ్రుద్దీన్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో జఫ్రుద్దీన్ పై దాడికి పాల్పడ్డ నిందితులు.. సమీపంలోని సెలూన్ కు లాక్కెళ్లి బలవంతంగా అతని గడ్డం తీయించారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించారు. కానీ వెనక్కి తగ్గని జఫ్రుద్దీన్ మరుసటి రోజు ఉదయాన్నే సెక్టార్ 37 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనకు సంబంధించి గౌరవ్, ఏకలాస్, నితిన్ అనే నిందితుల్ని అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటన వెనుక ఏ సంస్థా లేదని పోలీసులు స్పష్టం చేశారు.

More Telugu News