Srisailam: శ్రీశైలానికి పూర్తిగా నిలిచిన వరద... ఎగువన వర్షాలు పడకుంటే సాగర్ ఆయకట్టుకు నీరు హుళక్కే!

  • నిలిచిపోయిన వరద ప్రవాహం
  • ఈ సీజన్ లో 15 రోజులు కొనసాగిన వరద
  • 873 అడుగులకు శ్రీశైలం నీటిమట్టం

శ్రీశైలం జలాశయానికి దాదాపు 15 రోజుల పాటు కొనసాగిన వరద ప్రవాహం ఆగిపోయింది. ఎగువన వర్షాలు కురవకపోవడంతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల గేట్లను అధికారులు మూసేశారు. దీంతో 885 అడుగుల నీటి నిల్వ సామర్థ్యమున్న శ్రీశైలం జలాశయంలో 873.40 అడుగుల వరకే నీరు వచ్చింది. ఇక ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవకుంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీరు వచ్చే అవకాశాలు చాలా స్వల్పం. దీంతో ఇప్పటికే పొలం పనుల్లో బిజీగా ఉన్న ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొని ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కొంత నీరు వదిలే అవకాశాలు పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా, 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 156.38 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

More Telugu News