Andhra Pradesh: తల్లితో సంబంధం పెట్టుకుని బిడ్డను వివాహం చేసుకున్న ప్రబుద్ధుడు.. బాలికను రక్షించిన పోలీసులు!

  • పని కోసం కువైట్ వెళ్లిన బాలిక తల్లి
  • అక్కడ ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం
  • పది లక్షల ఆశ చూపి ఆమె కుమార్తెను పెళ్లాడిన వైనం

ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ప్రబుద్ధుడు ఆమె 14 ఏళ్ల కుమార్తెను పెళ్లి చేసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. కడప జిల్లాలో జరిగిందీ ఘటన. బాలికను రక్షించిన పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కడపకు చెందిన బాధిత బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. బాలికకు 11 నెలల వయసున్నప్పుడు ఆమెను తన తల్లిదండ్రుల వద్ద వదిలేసి పని కోసం తల్లి గల్ఫ్ వెళ్లింది.

ఈ క్రమంలో ఆమెకు సుండుపల్లెకు చెందిన రెడ్డయ్యతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. మాటల సందర్భంలో ఆమెకు 14 ఏళ్ల కుమార్తె ఉందని రెడ్డయ్యకు తెలిసింది. డబ్బుపై ఆమెకున్న మక్కువను క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించిన రెడ్డయ్య.. బిడ్డను తనకు ఇచ్చి వివాహం చేయాలని, పది లక్షల రూపాయలు ఇస్తానని ఆశ పెట్టాడు. దీనికి ఆమె సరేననడంతో రెండు నెలల క్రితం ఇద్దరూ కలిసి కువైట్ నుంచి కడప చేరుకున్నారు.

ఇంటికి వచ్చినప్పటి నుంచి రెడ్డయ్యను పెళ్లి చేసుకోవాలని కుమార్తెను తల్లి బలవంతం చేయసాగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక తాను పెళ్లి చేసుకోబోనని తేల్చి చెప్పింది. దీంతో తల్లి ఆమెను చిత్రహింసలకు గురిచేసింది. అయినా మాట వినకపోవడంతో గత నెల 29న బాలికను సుండుపల్లెకు తీసుకెళ్లి ఓ ఇంట్లో నిర్బంధించి రెడ్డయ్యతో ఆమెకు బలవంతంగా పెళ్లి చేసింది.

విషయం తెలిసిన కొందరు వ్యక్తులు కడప మహిళా పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారు రంగంలోకి దిగి బాలికను రక్షించారు. బాలిక తల్లి, తండ్రితోపాటు రెడ్డయ్య, నాగరాజు అనే మరో వ్యక్తిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

More Telugu News