Pakistan: మోదీని ఆహ్వానించాలనుకుంటున్న ఇమ్రాన్... రాకుంటే పరువు పోతుందంటున్న అధికారులు!

  • మోదీ వస్తే బాగుంటుందనుకుంటున్న ఇమ్రాన్
  • తిరస్కరిస్తే పరువు పోతుందంటున్న అధికారులు
  • మోదీ అభిప్రాయం తెలుసుకునే యోచనలో విదేశాంగ శాఖ

మరో పది రోజుల్లో పాకిస్థాన్ ప్రధానమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసే వేళ, భారత ప్రధాని నరేంద్ర మోదీ పక్కన ఉంటే బాగుంటుందని భావిస్తున్న పీటీఐ (పాకిస్తాన్‌ తెహ్రిక్‌ ఇ ఇన్సాఫ్‌) అధినేత ఇమ్రాన్ ఖాన్, ఇదే విషయమై పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి తెహ్మినా జన్జువాతో చర్చించారు. మోదీతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్, టర్కీ అధ్యక్షుడు ఎర్డొగన్ లు సహా సార్క్‌ దేశాధినేతల్ని ఆహ్వానించాలని ఇమ్రాన్‌ ఖాన్ ఆలోచనలో ఉన్నట్టు పాకిస్థాన్ టీవీ చానల్ ఒకటి పేర్కొంది.

అయితే, ఇమ్రాన్‌ ప్రమాణస్వీకార ఆహ్వానాన్ని మోదీకి పంపించి, ఆ తరువాత ఆయన రాలేనని తిరస్కరిస్తే, అంతర్జాతీయంగా పాకిస్థాన్ తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని, అంతవరకూ తెచ్చుకునే కంటే, పిలవక పోవడమే మంచిదని సైన్యాధికారులు, విదేశాంగ శాఖ భావిస్తున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని వారు ఇమ్రాన్ ఖాన్ కు వెల్లడించినట్టు ఓ అధికారి తెలిపారు. అయితే, భారత్ లోని పాక్ రాయబార కార్యాలయం ద్వారా మోదీ అభిప్రాయాన్ని తెలుసుకుని, ఆపై ఆయన్ను అధికారికంగా ఆహ్వానించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని పాక్ విదేశాంగ శాఖ ఆలోచనగా తెలుస్తోంది.

More Telugu News