beerendra: ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఇప్పుడే ఏ ప్రకటనా చేయలేను: కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్

  • టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం
  • ఈ నివేదికకు ఎలాంటి కాలపరిమితీ లేదు
  • హర్యానా ఇప్పటికీ విభజన సమస్యలు ఎదుర్కొంటోంది

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తో టీడీపీ ఎంపీలు భేటీ అయ్యారు. అనంతరం, మీడియాతో బీరేంద్ర సింగ్ మాట్లాడుతూ, విభజన చట్టంలో పేర్కొన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఈ విషయమై తాను ఇప్పుడే ఏ ప్రకటనా చేయలేనని అన్నారు.

ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొన్ని సమాధానాలు రావాల్సి ఉందని, టాస్క్ ఫోర్స్ అడిగిన ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం జవాబిచ్చిందని, తెలంగాణ నుంచి ఏడు ప్రశ్నలకు జవాబు రావాల్సి ఉందని అన్నారు. టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా ఓ నిర్ణయం తీసుకుంటామని, ఈ నివేదికకు ఎలాంటి కాలపరిమితీ లేదని స్పష్టం చేశారు. పంజాబ్ నుంచి విడిపోయిన హర్యానా కూడా ఇప్పటికీ విభజన సమస్యలు ఎదుర్కొంటోందని అన్నారు.

More Telugu News