sharwanand: శర్వానంద్ తో నేనేం గొడవ పడలేదు: సాయిపల్లవి

  • సాయిపల్లవి హీరోలతో గొడవ పడుతుందంటూ ప్రచారం  
  • తెలుగు .. తమిళ భాషల్లో వరుస సినిమాలు
  • తాజా చిత్రంగా 'పడి పడి లేచే మనసు'  

 తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా సాయిపల్లవికి మంచి క్రేజ్ వుంది. పారితోషికం ఎంత ఇస్తానని చెప్పినా, కథ బాగుంటేనే తప్ప సాయిపల్లవి ఓకే చెప్పదనే మంచి పేరు వుంది. అలాంటి సాయిపల్లవి .. తన కాంబినేషన్లోని హీరోలతో గొడవపడుతూ వుంటుందనే వార్తలు ఇక్కడ జోరుగా వినిపిస్తున్నాయి. 'కణం' సినిమా సమయంలో నాగశౌర్యతోను .. 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సమయంలో నానితోను గొడవపడిందనే టాక్ వచ్చింది.

తాజాగా శర్వానంద్ సరసన సాయిపల్లవి 'పడి పడి లేచే మనసు' సినిమా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఆ తరువాత సాయిపల్లవితో జరిగిన గొడవ కారణంగా శర్వానంద్ షూటింగుకి వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై సాయిపల్లవి స్పందించింది.

 ''శర్వానంద్ తో నేను గొడవ పడినట్టుగా .. అందువల్లనే షూటింగ్ ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు .. మా మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. శర్వానంద్ మరో సినిమా కూడా చేస్తున్నాడు .. ఆ సినిమా షూటింగులో పాల్గొంటున్న కారణంగా ఆయన ఈ సినిమాకి బ్రేక్ ఇచ్చాడు .. అంతే" అంటూ చెప్పుకొచ్చింది.      

More Telugu News