Sandalwood: నటికి మత్తుమందు ఇచ్చి అసభ్యకర వీడియో చిత్రీకరణ.. ఆపై రూ.14 లక్షలు గుంజిన శాండల్‌వుడ్ విలన్!

  • సునీతకు మత్తుమందు ఇచ్చి అసభ్యకర వీడియో చిత్రీకరణ
  • దానిని చూపించి బ్లాక్ మెయిల్
  • రూ.14 లక్షల వసూలు
  • ఇవ్వకుంటే అందరినీ చంపేస్తానని ఇంటికొచ్చి మరీ బెదిరింపు

నటి అసభ్యకర వీడియోను చిత్రీకరించి, ఆపై దానిని చూపించి బ్లాక్‌మెయిల్ చేసి రూ.14 లక్షలు వసూలు చేసిన ఘటనలో కన్నట స్టార్ నటుడు ధర్మేంద్ర అలియాస్ ధర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. శాండల్‌వుడ్‌లో ప్రతినాయక పాత్రలు పోషించే ధర్మపై నటి సునీత బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017 మార్చి నుంచి ధర్మేంద్ర తన నుంచి బలవంతంగా డబ్బులు గుంజుతున్నట్టు ఆరోపించింది. అతడి డిమాండ్లను నెరవేర్చకుంటే తన భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

పోలీసుల కథనం ప్రకారం.. జూన్ 6న ఉదయం పది గంటల సమయంలో సునీత బెంగళూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ధర్మపై బలవంతపు వసూళ్లు, బెదిరింపుల కేసు పెట్టింది.మార్చి 1, 2017న  రాత్రి సునీతకు ఫోన్ చేసిన ధర్మ షూటింగ్ కోసం వెంటనే బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌కు వెళ్లాలని సూచించాడు. అందుకోసం తన డ్రైవర్ నవీన్‌కు కారు ఇచ్చి సునీత ఇంటికి పంపాడు. అతడు ఆమెను తీసుకెళ్లి షూటింగ్ సెట్ వద్ద వదిలిపెట్టాడు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న ధర్మ షూటింగ్ రద్దు అయినట్టు చెప్పి భోజనానికి పిలిచాడు. భోజనం చేసి కూల్ డ్రింక్ తాగిన తర్వాత ఆమె అపస్మారక స్థితికి వెళ్లిపోయింది.

మెలకువ వచ్చి చూసిన తర్వాత ఆమెకు అసభ్యకర వీడియో చూపించిన ధర్మ బ్లాక్ మెయిల్ చేశాడు. తాను అడిగిన మొత్తాన్ని ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఆన్‌లైన్‌లో దానిని అప్‌లోడ్ చేస్తానని, ఆమె తల్లిదండ్రులకు దానిని చూపిస్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన సునీత మార్చి 2017 నుంచి మే 2018 వరకు మొత్తం రూ.14 లక్షలు చెల్లించుకుంది.

ఈ ఏడాది మే 27న ధర్మతో సునీత, ఆమె భర్త వాదనకు దిగారు. తమ నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ రాత్రి సునీత ఇంటికి వచ్చిన ధర్మ మరిన్ని డబ్బులు ఇవ్వకుంటే అందరినీ చంపేస్తానని బెదిరించాడని సునీత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ధర్మతోపాటు నవీన్ అనే మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News