Kidnap: ఎవరో పంపిన పోస్టును ఫార్వార్డ్ చేసిన పాపానికి... కిడ్నాపైన పాపను తెమ్మంటున్న అధికారులు!

  • కిడ్నాపైన పాప తమ వద్ద ఉందని పోస్టు
  • తల్లిదండ్రులకు తెలిసే వరకూ షేర్ చేయాలని పోస్టు
  • దాన్ని ఫార్వార్డ్ చేసిన అంగన్ వాడీ టీచర్
  • పాపను అప్పగించాలని అధికారుల ఆదేశంతో అవాక్కు

ఎవరో పాపను కిడ్నాపర్లు ఎత్తుకు పోయారని, ఆ పాప తమ వద్ద ఉందని, ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా షేర్ చేయాలని తన సెల్ ఫోన్ కు వచ్చిన మెసేజ్ ను అందరికీ పంపించడమే ఆ అంగన్ వాడీ టీచర్ పాలిట శాపమైంది. అంతకుముందు పాప కిడ్నాపైనట్టు వచ్చిన పోస్టు చూసిన ఓ యువకుడు, పాప ఫలానా యువతి వద్ద ఉందంటూ పోస్టులు పెట్టడంతో అధికారులు ఇప్పుడామె వెంట పడ్డారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, తూర్పు గోదావరి జిల్లా గొల్లపాలెం అంగన్ వాడీ కేంద్రంలో టి.వరలక్ష్మి అనే యువతి టీచర్ గా పనిచేస్తోంది.

ఆరు నెలల పాపను బిచ్చగాళ్ల దగ్గర తాము గుర్తించి పట్టుకున్నామని, విషయం పాప తల్లిదండ్రులకు తెలిసేంత వరకూ షేర్ చేసుకోవాలని చెబుతూ, రెండు ఫోన్ నంబర్లు ఇస్తూ, కొంత కాలం క్రితం ఓ పోస్టు వరలక్ష్మి మొబైల్ కు వచ్చింది.  ఆ పోస్టును ఆమె తన కాంటాక్టు లిస్టులోని కొందరికి పంపింది. ఆపై ఓ యువకుడు కిడ్నాపైన పాప వరలక్ష్మి దగ్గర ఉందంటూ పోస్టులు పెట్టగా, అవి జిల్లా అధికారులకు చేరాయి.

కలెక్టరేట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు, పాపను అప్పగించాలని వరలక్ష్మిని ఆదేశించగా, ఎవరో పెట్టిన మెసేజ్ ను తాను ఫార్వార్డ్ చేశానే తప్ప, లేని పాపను తాను ఎక్కడి నుంచి తేగలనని ఆమె వాపోతోంది. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు. సదరు పోస్టులోని నంబర్లకు కాల్ చేస్తే స్విచ్చాఫ్ వస్తోందని పోలీసులు పేర్కొన్నారు. 

More Telugu News