Mumbai: రైలు రావడాన్ని చూసి పట్టాలపై పడుకున్న వ్యక్తి... రక్షించిన ప్రయాణికుల వీడియో!

  • ఆత్మహత్యాయత్నం చేసిన నరేంద్ర
  • కుటుంబ సమస్యలే కారణం
  • స్పందించి కాపాడిన ప్రయాణికులు

ఆత్మహత్య చేసుకుందామని భావించిన ఓ యువకుడు రైలు వస్తుండటాన్ని గమనించి, రైలు పట్టాలపై పడుకోగా, దాన్ని చూసిన ఇతర ప్రయాణికులు పరుగున వెళ్లి బలవంతంగా లేపి ప్లాట్ ఫామ్ పైకి ఎక్కించిన ఘటన ముంబైలో జరిగింది. కుర్లా రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయి, ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
 
పట్టాలపై పడుకున్న వ్యక్తిని 54 సంవత్సరాల నరేంద్ర దమాజీ కోటేకర్ గా గుర్తించారు. కుటుంబ సమస్యల కారణంగా నరేంద్ర ఆత్మహత్యకు ప్రయత్నించాడని, అతన్ని గమనించిన తోటి ప్రయాణికులు రక్షించారని, కుర్లా స్టేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ తెలిపారు. ఆపై అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించామని అన్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం పాన్వేల్ రైల్వే స్టేషన్ లో ఇదేలా ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఓ యువకుడిని రైల్వే పోలీసు ఒకరు రక్షించిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఫిబ్రవరి 5వ తేదీన నయీగావ్ రైల్వే స్టేషన్ లో ఓ ఐదేళ్ల బాలుడిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడాడు. తాజా వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News