hrithik roshan: హృతిక్ రోషన్, సుసానే ఖాన్ లు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు.. అసలు నిజం ఏమిటంటే..!

  • నిన్నటి నుంచి భారీ ఎత్తున ప్రచారం
  • మళ్లీ అడుగుపెట్టే అవకాశం లేదన్న సుసానే
  • 2013లో విడిపోయిన హృతిక్ దంపతులు

ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, సుసానే ఖాన్ దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తమ పిల్లలతో కలసి హృతిక్, సుసానేలు అడపాదడపా సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వీరిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారంటూ నిన్నటి నుంచి భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది.

అయితే వీరికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ, ఇదంతా అవాస్తవమని కొట్టిపడేశారు. తల్లిదండ్రులతో కలసి గడపాలని వారి పిల్లలు ఎప్పుడు కోరుకున్నా... వారితో కలసి ఆనందంగా గడపడానికి ఇద్దరూ ఇష్టపడతారని చెప్పారు. తమ నుంచి తమ పిల్లలు ఏదీ కోల్పోకూడదనేది వారి ఆకాంక్ష అని తెలిపారు. హృతిక్, సుసానేలు ఇద్దరూ బలమైన మనస్తత్వం కలవారని... ఒకవేళ మళ్లీ కలవాలని వారు భావిస్తే... కచ్చితంగా వారు మళ్లీ పెళ్లి చేసుకుంటారని చెప్పారు.

ఈ వార్తలపై సుసానే కూడా ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఇలాంటి ఊహాజనిత వార్తలను ప్రచారం చేయవద్దని కోరుతున్నానని ఆమె తెలిపింది. హృతిక్ జీవితంలోకి మళ్లీ అడుగుపెట్టే అవకాశం లేదని స్పష్టం చేసింది. కానీ, తామిద్దరం మంచి తల్లిదండ్రులుగా మాత్రం ఉంటామని చెప్పింది.

ప్రముఖ నటుడు సంజయ్ ఖాన్ కుమార్తె సుసానేను 2000 సంవత్సరంలో హృతిక్ పెళ్లాడాడు. అంతకు ముందు వీరిద్దరూ నాలుగేళ్ల పాటు డేటింగ్ చేశారు. 17 ఏళ్ల తమ అనుబంధాన్ని 2013లో వారు తెంచుకున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదం సమయంలో కూడా హృతిక్ కు సుసానే మద్దతుగా నిలిచింది. 

More Telugu News