Hyderabad: దాచిపెట్టమని రూ. 41 లక్షలు ఇచ్చిన భర్త... నొక్కేద్దామని చూసి కటకటాలపాలైన భార్య!

  • హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఘటన
  • ఊరెళ్లి వచ్చేలోగా డబ్బు మాయం
  • భార్యే మాయం చేసిందని తేల్చిన పోలీసులు

ఇల్లు కొనుగోలు చేసేందుకంటూ భర్త తెచ్చి ఇచ్చిన రూ. 41 లక్షలను ఎలాగైనా కాజేయాలని చూసిన ఓ భార్య ఇప్పుడు కటకటాలపాలైంది. హైదరాబాద్, ఎల్బీ నగర్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, నిర్మాణ రంగంలో వ్యాపారం చేస్తున్న కావలి నారాయణకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సుధతో కలసి ఆయన దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇల్లు కొనేందుకంటూ డబ్బు తెచ్చి ఇంట్లో దాచారు. ఆపై 28వ తేదీన చేవెళ్లకు వెళ్లి మరునాడు వచ్చి డబ్బు గురించి అడిగాడు.

"ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి ఇద్దరిని పంపించారుగా? వారు వచ్చి మీతో ఫోన్ లో స్పీకర్ ఆన్ చేసి మాట్లాడించారుగా? మీరు చెప్పినట్టే డబ్బు ఇచ్చాను" అని చెప్పడంతో నారాయణ అవాక్కయ్యాడు. తాను ఎవరినీ పంపించలేదని, తన ఇంట్లో డబ్బు పోయిందని పోలీసులను ఆశ్రయించగా, ఆ పరిసరాల సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించారు. సుధ చెప్పిన సమయంలో ఎవరూ అపార్టుమెంట్ లోపలికి రాలేదని గుర్తించి, సుధను గట్టిగా ప్రశ్నించారు. మొదటి భార్యనైనా తన పేరుపై ఎలాంటి ఆస్తులూ లేకపోవడంతో డబ్బు దక్కించుకోవాలని నిర్ణయించుకున్నానని, దాన్ని మంచం కింద బాక్సులోనే ఉంచానని చెప్పడంతో, ఆమెను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.

More Telugu News