nagachaithanya: భారీ రేటుకు 'సవ్యసాచి' థియేట్రికల్ హక్కులు!

  • 'సవ్యసాచి' సినిమాపై క్రేజ్ 
  • చైతూ జోడీగా నిధి అగర్వాల్ 
  • త్వరలో ప్రకటించనున్న రిలీజ్ డేట్

చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 'సవ్యసాచి' సినిమా రూపొందుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, మాధవన్ .. భూమిక కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై .. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. గతంలో చైతూ .. చందూ కాంబినేషన్లో వచ్చిన 'ప్రేమమ్' మూవీ భారీ విజయాన్ని సాధించింది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు వున్నాయి.

ఈ కారణంగానే ఈ సినిమా విడుదల హక్కులకు గట్టిపోటీ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ  సినిమా విడుదల హక్కులు 9.5 కోట్లకు అమ్ముడైనట్టుగా సమాచారం. కర్ణాటక విడుదల హక్కులు కూడా భారీ రేటుకే అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు నాగచైతన్య 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా చేసిన సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆగస్టు 31వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తరువాత శివ నిర్వాణ ప్రాజెక్టును చైతూ పట్టాలెక్కించనున్నాడు.     

More Telugu News