pavan kalyan: అమరావతిని అడ్డుకునేందుకు వైసీపీ-జనసేన కలసి కుట్ర!: మంత్రి పుల్లారావు ఆరోపణ

  • పవన్ రాజధాని పర్యటన వెనుక బీజేపీ
  • దళిత రైతులకు అన్యాయం చేయొద్దని హితవు
  • అమరావతిని అడ్డుకునేందుకు వైసీపీ కేసులు వేసిందని మండిపాటు

ప్రజల రాజధాని అమరావతిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష వైసీపీ, జనసేన కలసి కుట్ర పన్నుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. అసలు రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి పవన్ ఎవరని ఆయన ప్రశ్నించారు. పవన్ అమరావతి పర్యటన వెనుక బీజేపీ ఉన్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇలాంటి పనులు చేస్తూపోతే ప్రజలు, రైతులు తిరగబడతారని హెచ్చరించారు. కేవలం చంద్రబాబుపై నమ్మకంతో ప్రజలు వేలాది ఎకరాల భూమిని రాజధాని కోసం ప్రభుత్వానికి అప్పగించారని పుల్లారావు వ్యాఖ్యానించారు.

ఇప్పటివరకూ వైసీపీ నేతలు కేసులతో రాజధానిని అడ్డుకునేందుకు యత్నిస్తే .. తాజాగా అమరావతిని అడ్డుకుంటామని పవన్ చెప్పడం దారుణమన్నారు. రాజధాని కారణంగా పేద దళిత రైతుల భూముల విలువ కోట్లకు చేరుకుందనీ, ఇప్పుడు రాజధానిని అడ్డుకోవడం ద్వారా పవన్ వారందరికీ అన్యాయం చేయాలనుకుంటున్నారా? అని ప్రత్తిపాటి ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలోని దళిత రైతులకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు.

More Telugu News