jagan: పాదయాత్ర కోసం మీరు ఒక్క రూపాయైనా ఖర్చు పెట్టారా? మీ ఆర్భాటాల కోసం కాపులు నాశనమైపోవాలా?: జగన్ పై మండిపడ్డ ముద్రగడ

  • ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు కాపులను సమన్వయకర్తలుగా నియమించారు
  • ఒక్కొక్కరితో 50 లక్షల నుంచి కోటి వరకు ఖర్చు చేయిస్తున్నారు
  • మీ కోసం కాపు నేతలు ఆస్తులు అమ్ముకుంటున్నారు

వైసీపీ అధినేత జగన్ పై కాపు నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. జగన్ పాదయాత్రపై ఆయన విమర్శలు గుప్పించారు. ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురు కాపు నేతలను పార్టీ సమన్వయకర్తలుగా నియమించారని... పాదయాత్రలో మీ హంగు ఆర్భాటాల కోసం ఒక్కొక్కరితో రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పాదయాత్ర కోసం కాపు కుటుంబాలు నాశనమైపోవాలా? అని ప్రశ్నించారు. పాదయాత్ర కోసం మీరు కనీసం ఒక్క రూపాయైనా ఖర్చు చేస్తున్నారా? అని అడిగారు. అంతా సమన్వయకర్తలపై పెట్టేసి, వారి జీవితాలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.  

అడుగడుగుకు ఒక ఫ్లెక్సీ, గజానికో పెద్ద బోర్డు, పది గజాలకు ఒక గేటు... ఇంత ఖర్చును మా కాపు నేతలు భరించాలా? అని ముద్రగడ ప్రశ్నించారు. మీలా మేము అపర కోటీశ్వరులం కాదని... మీ పాదయాత్ర కోసం కాపు నేతలు ఆస్తులు అమ్ముకుంటున్నారని... వారి పిల్లల జీవితాలు నాశనమైపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీ పాదాల కిందో, మరొకరి పాదాల కిందో కాపు జాతి అనునిత్యం బతకాలా? మీ మోచేతి నీళ్లు తాగుతూ జీవించాలా? అని ప్రశ్నించారు. 

More Telugu News