Tollywood: అన్నంత పనీ చేసిన శ్రీరెడ్డి... వారాహిపై కమిషనర్ కు ఫిర్యాదు!

  • శ్రీరెడ్డి వ్యభిచారి అని వ్యాఖ్యానించిన తమిళ నటుడు వారాహి
  • చెన్నై పోలీసు కమిషనర్ ను కలసి ఫిర్యాదు చేసిన శ్రీరెడ్డి
  • నడిగర్ సంఘానికి చెబుదామనుకుంటే పట్టించుకోలేదని ఆరోపణ

టాలీవుడ్ లో నటించేందుకు అవకాశాలు ఇచ్చే నెపంతో అమ్మాయిలను లైంగికంగా వేధిస్తారని ఆరోపిస్తూ, క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం సాగించిన శ్రీరెడ్డి, తనపై తీవ్ర విమర్శలు చేసిన కోలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత వారాహిపై చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటీవల ఓ మీడియా సమావేశంలో వారాహి మాట్లాడుతూ, శ్రీరెడ్డిని వ్యభిచారి అంటూ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పిన శ్రీరెడ్డి, తాజాగా చెన్నై వెళ్లి, పోలీసు కమిషనర్ ను కలసి ఫిర్యాదు చేసింది. సినిమాల్లో అవకాశాల పేరిట అమ్మాయిలను నమ్మించి మోసం చేస్తున్న వారి పేర్లను తాను బయట పెడుతున్నానని, ఈ క్రమంలో వారాహి, మీడియాతో మాట్లాడుతూ తనను వ్యభిచారిగా చిత్రించాడని ఆరోపించింది.

తనకు ఫోన్ చేసి బెదిరించారని, తప్పుగా మాట్లాడారని, ఆయన మాటలతో తాను మనస్తాపానికి గురయ్యానని చెప్పింది. వారాహిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్టు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాన్ని నడిగర్ సంఘం పెద్దలు నాజర్, విశాల్, కార్తిలకు ఫిర్యాదు చేయాలని చూస్తే, వాళ్లు పట్టించుకోలేదని వెల్లడించింది. కాగా, మురుగదాస్, లారెన్స్ లపై శ్రీరెడ్డి కామెంట్లు చేసిన తరువాత, గత నెల 24వ తేదీన వారాహి మీడియా ముందుకు వచ్చి శ్రీరెడ్డి ఓ వేశ్యని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

More Telugu News