Muzaffar Hussain Baig: ముస్లింలపై దాడుల్నిఆపకుంటే మరోసారి దేశ విభజన.. కశ్మీర్ నేత హెచ్చరిక

  • పీడీపీ నేత ముజఫర్ హుస్సేన్ బేగ్ సంచలన వ్యాఖ్యలు
  • మూకదాడులపై దృష్టి సారించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి
  • శనివారం ముగిసిన పీడీపీ19వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

ఆవుల స్మగ్లర్ల పేరిట పలువురు ముస్లింలను ఇటీవలి కాలంలో గోరక్షక ముఠాలు కొట్టిచంపడంపై పీడీపీ నేత, జమ్మూకశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం ముజఫర్ హుస్సేన్ బేగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు లక్ష్యంగా జరుగుతున్న ఈ మూకహత్యల్ని అడ్డుకోకపోతే మరోసారి దేశ విభజన తప్పదని హెచ్చరించారు. ఈ దాడుల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. శనివారం పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) 19వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన శ్రీనగర్ లో మాట్లాడారు.


గోరక్షణ పేరుతో ప్రస్తుతం జరుగుతున్న దాడుల్ని నిలువరించకపోతే మరోసారి దేశ విభజన ఎదుర్కొనక తప్పదని బేగ్ హెచ్చరించారు. కశ్మీరీ ప్రజలకు న్యాయం చేసేందుకే జమ్మూకశ్మీర్ లో బీజేపీతో జట్టుకట్టామనీ, అధికారంపై వ్యామోహంతో కాదని స్పష్టం చేశారు. కశ్మీర్ అంశంపై భారత్-పాకిస్తాన్ ల మధ్య చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో బీజేపీతో పీడీపీ చేతులు కలిపిందన్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్ లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News