Pakistan: ఇమ్రాన్ ఖాన్ పార్టీ జెండాను చుట్టుకున్న శునకం.. కాల్చి చంపిన దుండుగులు!

  • ఇమ్రాన్ ప్రత్యర్థుల పనేనని అనుమానం
  • ఎన్నికల్లో గాడిదకు పేరు పెట్టి రాళ్లతో కొట్టిన వైనం
  • ఆందోళనలో జంతు ప్రేమికులు

పాకిస్థాన్‌లో దారుణాలు ఎంత ఘోరంగా ఉంటాయో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. పాషాణ హృదయాలను కూడా కరిగించే ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) గెలుపొందింది. ఈ క్రమంలో ఆ పార్టీ జెండాను చుట్టుకున్న ఓ శునకాన్ని ఇద్దరు వ్యక్తులు అత్యంత దారుణంగా కాల్చిచంపారు.

స్థానిక భాషలో మాట్లాడుతున్న వారు శునకంపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. హృదయ విదారకంగా అది అరుస్తుంటే వాళ్లు నవ్వుకుంటూ వెళ్లిపోవడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. శునకాన్ని కాల్చుతుండగా వీడియో తీసిన ఒకరు దానిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వైరల్ అవుతోంది. దుండగులు వ్యవహరించిన తీరుపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. శునకాన్ని కాల్చిన వారిని కూడా పట్టుకుని కాల్చాలని కామెంట్లు పెడుతున్నారు. పాకిస్థాన్‌లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పేందుకు ఈ ఘటన ఉదాహరణ అని చెబుతున్నారు.

ఎన్నికల సందర్భంగా జరిగిన మరో ఘటనపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రచారంలో భాగంగా ఓ గాడిదకు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి పేరు పెట్టిన కొందరు దానిని రాళ్లతో కొట్టి హింసించారు. దీనిపై జంతు హక్కుల కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాడిదను హింసించిన వారే కుక్కను కూడా చంపి ఉంటారని అనుమానిస్తున్నారు.

More Telugu News