taapsee: తాప్సీకి ఆకతాయిల ట్రోలింగ్.. దీటుగా జవాబిచ్చిన ముద్దుగుమ్మ!

  • ట్విట్టర్ లో తాప్సీని వేధించిన ఆకతాయిలు
  • దీటుగా స్పందించిన సొట్ట బుగ్గల సుందరి
  • నన్ను మరికొంత కాలం భరించక తప్పదని చురకలు

సోషల్ మీడియాలో ఆకతాయిల ఆగడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. వీరి బారిన పడినవాళ్లలో సాధారణ ప్రజలతో పాటు సినీ, క్రీడా ప్రముఖులు కూడా ఉంటున్నారు. తాజాగా బేబీ, పింక్ వంటి వరుస హిట్లతో బాలీవుడ్ లో దూసుకుపోతున్న సొట్ట బుగ్గల సుందరి తాప్సీని శుక్రవారం కొందరు ఆకతాయిలు ట్విట్టర్ లో వేధించే ప్రయత్నం చేశారు. కానీ తాప్సీ మాత్రం దీటుగా స్పందించి వాళ్ల నోళ్లను మూయించింది.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్న తాప్సీని వేధించాలని భావించిన సూరజ్ అనే ట్విట్టర్ యూజర్.. ‘బాలీవుడ్ లో అత్యంత చెత్తగా కన్పించే నటి తాప్సీనే. మళ్లీ ఆమెను చూడాలని అనుకోవడం లేదు. ఇంకో 2-3 సినిమాలు చేశాక తాను బాలీవుడ్ నుంచి మాయమైపోతుంది’ అని వెక్కిరించాడు. దీంతో తాప్సీ వెంటనే స్పందిస్తూ.. ‘అయ్యో! ఇప్పటికే నా మూడు సినిమాలు.. ముల్క్, మన్మర్జియాన్, బద్లా సినిమాలు పూర్తయిపోయాయి. మిమ్మల్ని నిరాశపర్చినందుకు క్షమించండి. కానీ మరో రెండు సినిమాలకు నేను ఇప్పటికే సంతకాలు కూడా పెట్టేశాను. నన్ను ఇంకొంతకాలం మీరు భరించక తప్పదు’ అని వ్యంగ్యంగా సమాధానమిచ్చింది.


ఇంతలోనే రోహిత్ అనే వ్యక్తి తాప్సీని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాడు. ‘అయ్యో..! మిమ్మల్ని భరించడం ఏంటి? నేనసలు మీ సినిమాలే చూడను. కాబట్టి అవి ఎప్పుడు వచ్చాయో, ఎప్పుడు వెళ్లిపోతాయో నాకస్సలు తెలీదు. మీ కొత్త సినిమా ముల్క్ ప్రచారం కోసం మీరు వేసే నాటకాలను చూడటానికే ఇంకా మిమ్మల్ని ఫాలో అవుతున్నా’ అని ఎకసెక్కాలాడాడు. ఈ కామెంట్లపై తాప్సీ దీటుగా స్పందిస్తూ.. ‘అంటే నేను మీకు వినోదం అందిస్తున్నట్లే కదా! అంటే ఓ నటిగా నా పనిని పూర్తి చేసినట్లే. దయచేసి మీ అభిరుచిని మార్చుకోండి. అప్పుడే మీరు సినిమాలు చూడగలరు’ అంటూ చురకలు అంటించింది. దీంతో ఆకతాయిలు తోక ముడిచారు.


తాప్సీ, రిషీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ముల్క్ సినిమా ఆగస్టు 3న విడుదల కానుంది. ఇందులో దేశద్రోహులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ కుటుంబం తరఫున వాదించే లాయర్ గా తాప్పీ నటించింది. ఈ చిత్రానికి అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు.

More Telugu News