Pawan Kalyan: యువతే ‘జనసేన’కు ఇంధనం: పవన్ కల్యాణ్

  • ‘జనసేన’లో చేరిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు
  • రాష్ట్రంలో ఏ మూలకెళ్లినా జన సైనికులు ఉంటారు
  • ఈసారి ‘జనసేన’కు అవకాశం ఇవ్వాలి

యువతే ‘జనసేన’కి ఇంధనమని, యువత శక్తికి స్థానిక నాయకుల అనుభవం తోడైతే రాష్ట్రంలో మన పార్టీ బలంగా పాతుకుపోతుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. నరసాపురం, నిడదవోలు, తణుకు ప్రాంతాలకు చెందిన పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు జనసేన పార్టీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వారికి ‘జనసేన’ కండువాలు కప్పి, పార్టీలోకి పవన్ ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ మూలకెళ్లినా జన సైనికులు ఉంటారని, పార్టీ జెండా ఎగురుతుందని అన్నారు. సమాజంలో సరికొత్త సామాజిక రాజకీయ మార్పు తీసుకొస్తానని నమ్మి పార్టీలో చేరిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నానని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని నలభై ఏళ్లు కాంగ్రెస్ పార్టీ, ఇరవై ఏళ్లు టీడీపీ పాలించాయని.. ఈసారి ‘జనసేన’కు అవకాశం ఇవ్వాలని కోరారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. ఇలా ఏ రాష్ట్రానికి వెళ్లినా ఇదే అభిమానం చూపిస్తున్నారని, తనకు యువశక్తిపై విశ్వాసం ఉందని అన్నారు.

More Telugu News