Mumbai: జూనియర్ ఆర్టిస్టును రేప్ చేసిన టీవీ ప్రొడ్యూసర్ కు ఏడేళ్ల జైలు శిక్ష!

  • 2012లో ముంబైలో ఘటన
  • ఆర్టిస్టును తీసుకెళ్లి అత్యాచారం
  • ఐదేళ్లు సాగిన విచారణ

జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న అభియోగాలు రుజువు కావడంతో ఓ టీవీ ప్రొడ్యూసర్ కు ముంబై ప్రత్యేక మహిళా కోర్టు ఏడేళ్ల కారాగార శిక్షను విధించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, 2012 సంవత్సరంలో 'ఏక్ వీర్ కీ అరదాస్ వీర్' టీవీ షో నిర్మాతగా ఉన్న ముకేష్ మిశ్రా (33), ఓ జూనియర్ ఆర్టిస్టు (33)కు షూటింగ్ ఉందని, పొద్దున్నే రావాలని ఫోన్ చేశాడు.

ఆమె ఆదరాబాదరాగా బస్ స్టాపుకు చేరుకోగా, అక్కడే ఉన్న ముకేష్, బస్సులో వెళితే లేట్ అవుతుందని చెబుతూ, తన బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అనంతరం మేకప్ రూముకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే ఆమె కూతురిని చంపేస్తానని బెదిరించాడు. ఆపై పదే పదే ఆమెను లైంగికంగా వేధించాడు. అతని వేధింపులు తాళలేకపోయిన బాధితురాలు, 2013లో భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ ఐదేళ్లు సాగి పూర్తయింది. ముకేష్ దోషేనని న్యాయస్థానం నిర్ధారించింది. ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తున్నట్టు తీర్పిచ్చింది.

More Telugu News