Royal Enfield: రాయల్ ఎన్ ఫీల్డ్ స్పెషల్ ఎడిషన్ బైక్ ల క్రేజ్... మూడు నిమిషాల్లోనే ఔటాఫ్ స్టాక్!

  • బుధవారం నాడు ఆన్ లైన్ లో విక్రయాలు
  • 178 సెకన్లలో 250 వాహనాల విక్రయం
  • ఇండియాలో తమ బైకులకు క్రేజ్ ఉందన్న రాయల్ ఎన్ ఫీల్డ్

ద్విచక్ర వాహనాల బ్రాండ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ విడుదల చేసిన స్పెషల్ ఎడిషన్ 'క్లాసిక్ 500 పెగాసస్' బైకులకు ఇండియాలో ఎక్కడా లేనంత స్పందన కనిపించింది. బుధవారం నాడు బైక్ విక్రయాలు ఆన్ లైన్లో చేపట్టగా, కేవలం 178 సెకన్లలోనే స్టాక్ మొత్తం అమ్ముడైందని సంస్థ ప్రకటించింది.

ప్రత్యేక ఎడిషన్ కింద 1000 బైకులను మాత్రమే తయారు చేసిన రాయల్ ఎన్ ఫీల్డ్, 250 బైకులను ఇండియాకు కేటాయించింది. మిగతా బైకులను యూకే, అమెరికా, ఆస్ట్రేలియాల్లో విక్రయించనున్నామని వెల్లడించిన సంస్థ ప్రెసిడెంట్ రుద్రతేజ్ సింగ్, ఈ అమ్మకాల సరళి ఇండియాలో తమ బైక్ లకు ఎంత క్రేజ్ ఉందన్న విషయాన్ని తెలుపుతోందని వ్యాఖ్యానించారు.

కాగా, ఈ బైక్ ధర రూ. 2.4 లక్షలు (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ). మొదట ఈనెల 10వ తేదీన అమ్మకాలు చేపట్టిన సంస్థ, ఆ రోజు వెబ్ సైట్ కు టెక్నికల్ సమస్యలు రావడంతో, తిరిగి 25న విక్రయాలు చేపట్టింది.

More Telugu News