chennai police: సూపర్ మార్కెట్ లో పోలీసావిడ చేతివాటం.. అడ్డుకున్న ఉద్యోగిపై దాడి!

  • తమిళనాడులో మహిళా కానిస్టేబుల్ చేతివాటం
  • క్షమాపణ పత్రం ఇవ్వాలని ఉద్యోగి డిమాండ్
  • భర్తను పిలిపించి చావగొట్టించిన అధికారిణి

దొంగలను పట్టుకోవాల్సిన ఓ పోలీస్ అధికారిణి ఏకంగా దొంగ అవతారం ఎత్తింది. ఓ సూపర్ మార్కెట్ లోని వస్తువుల్ని ఎంచక్కా జేబులో దాచుకోవడం మొదలు పెట్టింది. ఈ తతంగాన్ని గమనించి నిలదీసిన ఆ సంస్థ ఉద్యోగి వస్తువుల్ని వెనక్కు ఇవ్వాలని కోరడంతో కోపంతో రెచ్చిపోయిన ఆమె తన భర్తతో చావగొట్టించింది. ఈ ఘటన తమిళనాడులో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే చెట్ పేట్ లోని ఓ సూపర్ మార్కెట్ కు బుధవారం ఓ మహిళా కానిస్టేబుల్ వచ్చింది. ఫోన్ లో మాట్లాడుతూ షాపులోని ఒక్కో వస్తువును జేబులో దాచుకోవడం మొదలుపెట్టింది. దీన్ని అక్కడే పనిచేస్తున్న ప్రణవ్ అనే ఉద్యోగి గమనించాడు.

వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి దొంగలించిన వస్తువులను వెనక్కి ఇవ్వాలనీ, భవిష్యత్ లో ఇలాంటి పనులు చేయనని క్షమాపణ పత్రాన్ని రాసివ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సదరు మహిళా కానిస్టేబుల్ ఈ వ్యవహారంపై తన భర్తకు సమాచారమిచ్చింది. కొందరు వ్యక్తులతో కలసి అక్కడకు చేరుకున్న కానిస్టేబుల్ భర్త, ప్రణవ్ పై విచక్షణారహితంగా దాడిచేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ప్రణవ్ ను సూపర్ మార్కెట్ లోని సహోద్యోగులు ఎలాగోలా రక్షించి ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు చెన్నై పోలీసులు తెలిపారు.

More Telugu News