Sensex: అన్నీ మంచి శకునములే... ఆల్ టైమ్ హైలో నిఫ్టీ!

  • సెంటిమెంట్ ను పెంచిన ప్రపంచ మార్కెట్లు
  • వెల్లువెత్తిన నూతన కొనుగోళ్లు
  • జీవనకాల గరిష్ఠస్థాయిలో సెన్సెక్స్, నిఫ్టీ

క్రితం సెషన్ లో యూరప్, అమెరికా స్టాక్స్ పెరిగిన తీరు, నేటి ఆసియా మార్కెట్ల సరళి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచడంతో సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయులకు చేరుకున్నాయి. మ్యూచువల్ ఫండ్ సంస్థలతో పాటు రిటైల్ ఇన్వెస్టర్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ఈక్విటీలను కొనుగోలు చేస్తున్నారు.

ఈ ఉదయం 10.40 గంటల సమయంలో సెన్సెక్స్ 37,014 పాయింట్లకు పెరిగి కొత్త ఆల్ టైమ్ రికార్డును నమోదు చేయగా, నిఫ్టీ 11,172 పాయింట్లకు పెరిగి సరికొత్త రికార్డును నమోదు చేసింది. ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా పెరిగింది. అత్యధిక కంపెనీలు లాభాలను పండించుకున్నాయి. నిఫ్టీ-50లోని అన్ని కంపెనీలూ లాభాల్లోనే కొనసాగుతుండటం గమనార్హం.

ఈ ఉదయం 11.35 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 105 పాయింట్లు లాభపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 33 పాయింట్ల లాభంలో ఉంది. అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ, ఐచర్ మోటార్స్, గ్రాసిమ్ వంటి కంపెనీలు భారీ లాభాలను నమోదు చేయగా, హెచ్సీఎల్ టెక్, విప్రో ఇన్ ఫ్రాటెల్ వంటి కంపెనీలు స్వల్ప నష్టాల్లో నడుస్తున్నాయి. ట్రేడింగ్ అవుతున్న కంపెనీల్లో 1,136 కంపెనీలు లాభాలను, 658 కంపెనీలు నష్టాలను నమోదు చేయగా, 88 కంపెనీల ఈక్విటీ ధరలో ఎటువంటి మార్పూ లేదు.

More Telugu News