Andhra Pradesh: బంద్ న‌ష్టం వైసీపీ నేత‌లు భ‌రిస్తారా?: భూమా అఖిలప్రియ

  • పార్ల‌మెంటులో పోరాటం చేయకుండా బంద్ చేస్తారా?
  • రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారా?
  • బీజేపీతో కుమ్మ‌క్కు రాజ‌కీయాలు మానుకోండి

ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ వైసీపీ ఈ రోజు తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ ప‌ర్యాట‌క‌ శాఖ మంత్రి అఖిలప్రియ స్పందించారు. ప‌్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ రెండం‌కెల అభివృద్ధిని సాధిస్తూ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌గ‌తి సాధిస్తుంటే, దాన్ని చిదిమేసేందుకు వైసీపీ అరాచ‌కాలు చేస్తోంద‌ని మండిప‌డ్డారు. కేంద్ర బీజేపీతో వైసీపీ కుమ్మ‌క్కు రాజ‌కీయాలు చేస్తోంద‌ని విమర్శించారు. వైసీపీ నేతలు ఢిల్లీలో పోరాడి పార్లమెంట్ ను, కేంద్రాన్ని స్తంభింప‌చేయాల్సిందిపోయి, ఏపీలో అరాచ‌కం సృష్టిస్తారా? మ‌న క‌ళ్లు మ‌న‌మే పొడుచుకున్న‌ట్లు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. రెండంకెల అభివృద్ధిని సాధిస్తున్న న‌వ్యాంధ్ర ప్ర‌దేశ్ అభివృద్ధిని భ్రష్టు ప‌ట్టిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

రాష్ట్ర స్థూల ఉత్ప‌త్తి (జీఎస్డీపీ) 18 ల‌క్ష‌ల కోట్లు అని, ప్ర‌తిరోజు వ‌స్తు సేవ‌ల వ‌ల్ల రాష్ట్ర సంప‌త్తి రూ.2,190 కోట్లు అని.. ఒక రోజు బంద్ వ‌ల్ల ఈ వ‌స్తు సేవ‌ల‌న్నీ ప్ర‌భావితమ‌వ‌డ‌మే కాకుండా, మ‌ళ్ళీ సామాన్య స్థితికి చేరుకోవ‌డానికి మూడు రోజులు ప‌డుతుందని, ఈ న‌ష్టం ఎవ‌రు భ‌రిస్తారు? అని ప్రశ్నించారు. అస‌లే రాష్ట్రానికి నిధులు ఇవ్వ‌క‌, హోదా ఇవ్వ‌క‌, బ‌డ్జెట్ లోటు పూరించ‌క‌, నెల‌కొల్పాల్సిన సంస్థ‌లను కేంద్రం ఇవ్వడం లేదని, దీనికి తోడు వైసీపీ బంద్ వ‌ల్ల ఏపీ మ‌రింత కుదేలవుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ్యాపార ఉత్ప‌త్తులు, ర‌వాణా సేవ‌లు, స‌రుకుల ర‌వాణాపై ప్ర‌తి రోజు రూ.115 కోట్ల ఆదాయం రాష్ట్రానికి వ‌స్తుందని, ఈ బంద్ వ‌ల్ల ఈ ఆదాయం అంతా న‌ష్టమే కాకుండా, వ్యాపారుల ట‌ర్నోవ‌ర్ ఆరేడు రెట్లు అంటే దాదాపు రూ. 700 కోట్ల న‌ష్టం జ‌రుగుతుందని అన్నారు.

ఒక రోజు బంద్ కారణంగా కార్మికుల రోజువారీ కూలీ, ఫ్యాక్ట‌రీ కార్మికుల న‌ష్టాల‌ను ఎవ‌రు భ‌రిస్తారు? అఖిల ప్రియ ప్ర‌శ్నించారు. ఒక్క ఏపీఎస్ ఆర్టీసీకే నిత్యం 13 కోట్ల రూపాయ‌ల ఆదాయం వ‌స్తుందని, బంద్ వల్ల క‌నీసం 30 శాతం కూడా బ‌స్సులు న‌డ‌ప‌గ‌లిగినా రూ. 8 కోట్ల న‌ష్టం వ‌స్తుందని, ప్ర‌యాణికుల క‌ష్ట న‌ష్టాల‌ను ఎవ‌రు భ‌రించాలి? అని ప్రశ్నించారు. ఈ బంద్ వ‌ల్ల అక్వా ఉత్ప‌త్తుల ర‌వాణా ఆగిపోయి, విదేశీ మార‌క‌ద్ర‌వ్యానికి గండి ప‌డుతుందని, ఈ ఉత్ప‌త్తులు ప్రాసెసింగ్ కోసం ఫ్యాక్ట‌రీకి రాకుండా అడ్డుకున్నారని, ఒక్క రోజులో పాడైపోయే ఇలాంటి ఆహార ఉత్ప‌త్తుల న‌ష్టాన్ని వైసీపీ నేత‌లు భ‌ర్తీ చేస్తారా? ‘కేంద్రం మాదిరి మీరు కూడా రాష్ట్రంపై క‌క్ష సాధిస్తారా?’ అని వైసీపీ నేత‌ల‌ను నిల‌దీశారు. ఎన్నో ప్రాజెక్టులు, ఫ్యాక్ట‌రీలు, విద్యా సంస్థ‌లు ఒక రోజు మూత‌ప‌డితే, కార్మికుల‌కు, విద్యార్థుల‌కు, ప్ర‌గ‌తికి ఎంతో న‌ష్టమని, అంతేకాకుండా వాటిపై ఆధార‌ప‌డి బ‌తుకున్న వారికి కూడా ఎంత క‌ష్టం? ఎంత న‌ష్టం? అని అన్నారు.  

More Telugu News