Abhishek: మా మధ్య గొడవలేం లేవు.. అలాంటి రాతలు రాయకండి: అభిషేక్ బచ్చన్

  • తప్పుడు కథనాలు రాయొద్దని హితవు
  • ఐష్ తో  ఎలాంటి గొడవలు జరగలేదని స్పష్టీకరణ
  • తమ కుటుంబం సంతోషంగా ఉందని వివరణ

ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇతరుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సున్నితమైన అంశాలపై తప్పుడు కథనాలు రాయడాన్ని మానుకోవాలని హితవు పలికాడు. ఇటీవల విహారయాత్ర కోసం లండన్ కు వెళ్లిన బచ్చన్ దంపతులు కొన్ని రోజుల క్రితం ముంబైకి చేరుకున్నారు.

ఈ సందర్భంగా కుమార్తె ఆరాధ్య తల్లినే అంటిపెట్టుకుని ఉండటంతో ఐశ్వర్యకు, అభిషేక్ కు మధ్య గొడవయిందనీ, అందుకే ఆరాధ్య తండ్రి వద్దకు వెళ్లలేదని ఓ వెబ్ సైట్ కథనాన్ని ప్రచురించింది. ఇందుకు సాక్ష్యంగా ముంబై ఎయిర్ పోర్ట్ లో బచ్చన్ దంపతులు దిగిన సందర్భంగా తీసిన ఫొటోలను ప్రచురించింది. వీటిలో ఐశ్వర్యను ఆరాధ్య గట్టిగా వాటేసుకుని ఉండటంతో ఐష్-అభిషేక్ ల మధ్య పొరపొచ్చాలు ఏర్పడ్డాయని, అందుకే ఐష్ చిన్నారిని తండ్రి వద్దకు పంపలేదని సదరు వెబ్ సైట్ వ్యాఖ్యానించింది.

అభిషేక్ మండిపాటు:

సదరు వెబ్ సైట్ కథనంపై అభిషేక్ బచ్చన్ ట్విట్టర్లో తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. మీడియా పరిస్థితిని తాను అర్థం చేసుకోగలననీ, కానీ ఇతరుల జీవితానికి సంబంధించిన సున్నితమైన విషయాలను రాసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించాడు. తమ జీవితాలపై తప్పుడు కథనాలను రాయడం మానేయాలని స్పష్టం చేశాడు. తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవనీ, తామంతా సంతోషంగా ఉన్నామని తేల్చిచెప్పాడు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే అభిషేక్.. నెటిజన్లు, అభిమానుల ప్రశ్నలకు తరచుగా జవాబిస్తుంటాడు. చిన్నారి ఆరాధ్య ఇటీవల తరచూ పార్టీల్లో కనిపిస్తోందనీ, ఇందుకు ఐశ్వర్యనే కారణమని కొన్ని రోజుల క్రితం ఓ మహిళ విమర్శించగా.. ఆదివారం స్కూల్ ఉంటే అప్పుడు కూడా ఐశ్వర్యను పాఠశాలకు పంపేవాళ్లమని అభిషేక్ ఘాటుగా జవాబిచ్చాడు.

More Telugu News