Dawood Ibrahim: మాఫియాడాన్ దావూద్ ఆస్తులు వేలం.. ఆగస్టు 9న ముహూర్తం!

  • వేలానికి దావూద్ ఆస్తులు
  • ముంబై సహా వివిధ ప్రాంతాల్లో దావూద్‌కు ఆస్తులు
  • మసుల్లా బిల్డింగ్ ప్రారంభ ధర రూ. 79.43 లక్షలు

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తులు వేలానికి రానున్నాయి. వచ్చే నెల 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ముంబైలోని  వైబీ చవాన్‌ ఆడిటోరియంలో వేలం ప్రక్రియ జరుగనుంది. ఇబ్రహీం, అతడి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులను వేలం వేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ముంబైలోని పాక్‌మోడియా వీధిలో ఉన్న దావూద్ ఆస్తులను వేలంలో కొనుగోలు చేయాలనుకునేవారు తొలుత రూ.25 లక్షలను ఆరో తేదీలోగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ ముంబైలోని బెహెండీ బజార్‌లో ఉన్న మసుల్లా బిల్డింగ్ ప్రారంభ ధరను రూ. 79.43 లక్షలుగా నిర్ణయించింది. వేలానికి సంబంధించిన విషయాన్ని ప్రభుత్వం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. ఇ-వేలం, పబ్లిక్‌ ఆక్షన్‌, సీల్డ్‌ టెండర్ల ద్వారా మాత్రమే ఆస్తులను విక్రయించనున్నట్టు అందులో పేర్కొంది.

దావూద్ ఆస్తుల్లో కొన్నింటికి గతేడాది వేలం నిర్వహించారు. వేలంలో పాల్గొన్న సైఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ చాలా వరకు ఆస్తులను దక్కించుకుంది. రూ.11.50 కోట్లకు బిడ్ వేయడం ద్వారా ఆస్తులను సొంతం చేసుకుంది. తాజా వేలంలో ముంబై, ఔరంగాబాద్‌, వల్సద్‌, డామన్‌, సూరత్‌, అహ్మదాబాద్‌లోని దావూద్‌ ఆస్తులను సైతం వేలం వేయనున్నారు.

More Telugu News