Bihar: అత్యాచార బాధితులను నగ్నంగా నిద్ర పెడుతున్న షెల్టర్ హోమ్ అధికారులు!

  • బీహార్ ముజఫర్ పూర్ లో దారుణం
  • షెల్టర్ హోమ్ లో అమ్మాయిలపై దాష్టీకాలు
  • పోలీసుల విచారణలో వెల్లడైన విస్తుపోయే నిజాలు

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ పూర్ లో ఉన్న మహిళా సంరక్షణా కేంద్రంలో అత్యాచారాలకు గురవుతున్న అమ్మాయిల కేసును ఛేదించేందుకు వెళ్లిన పోలీసులకు మరిన్ని షాకింగ్ నిజాలు తెలిశాయి. ఇక్కడ గత కొంతకాలంగా 40 మంది మైనర్ బాలికలు ఆశ్రయం పొందుతుండగా, వారితో బలవంతంగా బట్టలూడదీయించి, నగ్నంగా నిద్ర పెడుతున్నారని పోలీసులు గుర్తించారు.

అక్కడ పనిచేసే కిరణ్ అనే ఉపాధ్యాయురాలు ఈ పని చేయిస్తోందని, ఆమె కూడా వారితోపాటు వివస్త్రగా మారి నిద్రిస్తోందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. సంరక్షణాలయం అధికారులకు సహకరించ లేదన్న ఆగ్రహంతో ఓ బాధితురాలిని కొట్టి చంపారన్న ఆరోపణలపై సోదాలకు వెళ్లిన పోలీసులకు, అక్కడ ఆశ్రయం పొందుతున్న అమ్మాయిలు భయంకర నిజాలను పూస గుచ్చినట్టు చెప్పారు. ఓ అమ్మాయిని చంపి అదే ప్రాంతంలో నాలుగ్గోడల మధ్య పాతి పెట్టారని కొందరు చెప్పడంతో, మృతదేహాన్ని వెలికితీసే పనిలో పడ్డారు పోలీసులు.

కాగా, దాదాపు నెల రోజుల క్రితం ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ ఉదంతం వెలుగులోకి రాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు పెట్టిన పోలీసులు హోమ్ స్టాఫ్ మెంబర్స్, ప్రభుత్వ ఉద్యోగులు సహా మొత్తం 10 మందిని ఇప్పటివరకూ అరెస్ట్ చేశారు. అక్కడున్న బాధితులను వేరే జిల్లా షెల్టర్ లకు తరలించారు. అమ్మాయిలను రక్షించడంలో నితీశ్ కుమార్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విపక్ష నేత తేజస్వీ ప్రతాప్ యాదవ్ ఆరోపించారు. గత మార్చి నుంచి ముజఫర్ పూర్ షెల్టర్ హోమ్ లోని 40 మంది మైనర్ బాలికలను రాజకీయ నాయకులు, అధికారులు వాడుకున్నారని, కొందరికి బలవంతంగా అబార్షన్లు చేయించారని, వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆర్జేడీ ఒక ప్రకటనలో ఆరోపించింది.

More Telugu News